...
...
Next Story

పుణ్యక్షేత్రాల్లో రూమ్ బుక్ చేసుకునేముందు చూసుకోండి.. శ్రీశైలం పేరుతో ఫేక్ వెబ్‌సైట్!

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. ముందస్తుగా వసతి గదులు బుక్ చేసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులు మోసపోయిన విషయం బయటకు వచ్చింది.

Published on: Nov 24, 2025, 13:16:00 IST
Advertisement

శ్రీశైలంలో ఆదివారం నాడు భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఏపీ టూరిజం హరిత హోటల్ శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్ మోసగాళ్లు గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారని సమాచారం. భక్తులను నిలువునా మోసం చేస్తున్నారని తెలుస్తోంది. దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని కేటుగాళ్లు చెబుతున్నారు. తాజాగా ఓ ఘటనలో వెలుగులోకి వచ్చింది.

శ్రీశైలం
శ్రీశైలం

బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు శ్రీశైలం దేవస్థానం దర్శనం కోసం వస్తున్నానని, అందుకోసం ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. నకిలీ వెబ్‌సైట్ ద్వారా దాని ఆపరేటర్‌తో ఫోన్‌లో మాట్లాడి గదిని బుక్ చేశాడు. ఫోన్ పే ద్వారా రూ.15,950 చెల్లించి బుకింగ్ రసీదు కూడా పొందాడు. అది సరైనదేనని భావించి, ఆదివారం శ్రీశైలం చేరుకున్నాడు.

హరిత హోటల్ వద్దకు వెళ్ళి రసీదు చూపించాడు. కానీ అది నకిలీదని, అధికారిక ఏపీ టూరిజం పోర్టల్ ద్వారా బుకింగ్ చేయలేదని సిబ్బంది అతనికి సమాచారం ఇచ్చారు. ఆదివారం రద్దీ ఎక్కువగా ఉండటం, గదులు అందుబాటులో లేకపోవడంతో భక్తుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి ఫిబ్రవరిలో శ్రీశైలం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని హరిత హోటల్ మేనేజర్ పవన్ తెలిపారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, బుకింగ్‌ల కోసం అధికారిక ఏపీ టూరిజం వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని ఇలా దండుకుంటున్నారు కేటుగాళ్లు. ఏపీ టూరిజం పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు క్రియేట్ చేస్తున్నారు. వేలకు వేలు భక్తుల నుంచి దోచుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆలయ అధికారులు సైతం ఈ కేటుగాళ్లను గుర్తించలేకపోతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks