పుణ్యక్షేత్రాల్లో రూమ్ బుక్ చేసుకునేముందు చూసుకోండి.. శ్రీశైలం పేరుతో ఫేక్ వెబ్సైట్!
శ్రీశైలంలో నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. ముందస్తుగా వసతి గదులు బుక్ చేసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులు మోసపోయిన విషయం బయటకు వచ్చింది.
శ్రీశైలంలో ఆదివారం నాడు భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఏపీ టూరిజం హరిత హోటల్ శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్సైట్ను సైబర్ మోసగాళ్లు గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారని సమాచారం. భక్తులను నిలువునా మోసం చేస్తున్నారని తెలుస్తోంది. దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని కేటుగాళ్లు చెబుతున్నారు. తాజాగా ఓ ఘటనలో వెలుగులోకి వచ్చింది.

బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు శ్రీశైలం దేవస్థానం దర్శనం కోసం వస్తున్నానని, అందుకోసం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. నకిలీ వెబ్సైట్ ద్వారా దాని ఆపరేటర్తో ఫోన్లో మాట్లాడి గదిని బుక్ చేశాడు. ఫోన్ పే ద్వారా రూ.15,950 చెల్లించి బుకింగ్ రసీదు కూడా పొందాడు. అది సరైనదేనని భావించి, ఆదివారం శ్రీశైలం చేరుకున్నాడు.
హరిత హోటల్ వద్దకు వెళ్ళి రసీదు చూపించాడు. కానీ అది నకిలీదని, అధికారిక ఏపీ టూరిజం పోర్టల్ ద్వారా బుకింగ్ చేయలేదని సిబ్బంది అతనికి సమాచారం ఇచ్చారు. ఆదివారం రద్దీ ఎక్కువగా ఉండటం, గదులు అందుబాటులో లేకపోవడంతో భక్తుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఈ నకిలీ వెబ్సైట్ గురించి ఫిబ్రవరిలో శ్రీశైలం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని హరిత హోటల్ మేనేజర్ పవన్ తెలిపారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, బుకింగ్ల కోసం అధికారిక ఏపీ టూరిజం వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
దేవస్థానం పరిధిలో వసతి గదులు కల్పిస్తామని ఇలా దండుకుంటున్నారు కేటుగాళ్లు. ఏపీ టూరిజం పేరుతో ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేస్తున్నారు. వేలకు వేలు భక్తుల నుంచి దోచుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆలయ అధికారులు సైతం ఈ కేటుగాళ్లను గుర్తించలేకపోతున్నారు.
తాజాగా భక్తులకు జరిగిన మోసంపై సోషల్ మీడియాలో వైరల్ అయింది. నకిలీ వెబ్సైట్స్, యాప్స్ గురించి తెలియడంతో భక్తులు షాక్ అవుతున్నారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ వెబ్సైట్లతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఫేక్ వెబ్సైట్పై భక్తుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మెుదలుపెట్టారు.













