...
...
Next Story

CM Chandrababu : డిసెంబర్ కల్లా బందరు పోర్టు, పుష్కరాల నాటికి పోలవరం - మేడే సభలో సీఎం చంద్రబాబు

కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జరిగిన మేడే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు నడిపిస్తున్నామని చెప్పారు. బందరు పోర్టును డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.

Published on: May 1, 2026, 14:55:49 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 22 నెలలుగా ప్రతి గంటను ప్రజల కోసమే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో నిర్వహించిన 'పేదల సేవలో' మరియు మేడే పురస్కారాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులకు, పరిశ్రమల యాజమాన్యాలకు 'శ్రమ శక్తి' పురస్కారాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండేళ్ల కిందటి వరకు భయానక వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. "రెండేళ్ల మునుపు మనం ఈ విధంగా సరదాగా నవ్వుకుంటూ కూర్చునే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు కూడా బయట తిరగలేని దుస్థితి ఉండేది. ప్రజలందరికీ మరో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది" అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తాను, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ముగ్గురం కలిసి ఇచ్చిన హామీ కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు.

బందరు పోర్టు…. పోలవరం ప్రాజెక్టులపై డెడ్ లైన్

కృష్ణా జిల్లా అభివృద్ధికి చిహ్నమైన మచిలీపట్నం (బందరు) పోర్టుపై ముఖ్యమంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గత ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి గందరగోళం సృష్టించినా…. ఇప్పుడు పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. "బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ వంటి పనులు ఇప్పటికే 57 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బందరు పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం," అని ఆయన ప్రకటించారు.

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై స్పందిస్తూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, పుష్కరాల కంటే ముందే పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 13 ఏళ్ల క్రితం తాము నిర్మించిన పట్టిసీమ వల్లే నేడు కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేదని ఆయన గుర్తు చేశారు.

విశాఖ తర్వాత ఆదాయంలో కృష్ణా జిల్లా ముందంజలో ఉందని, అమరావతి రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చారని కొనియాడారు. జిల్లాలో భారత్ మాలా పరియోజన కింద రూ.574 కోట్లతో రోడ్ల విస్తరణ జరుగుతోందని, మచిలీపట్నం బైపాస్ రోడ్డును 6 లేన్లుగా మారుస్తున్నామని చెప్పారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe