పిల్లలకు అవతార్ సినిమా కాదు.. భారతం, రామాయణాలు గొప్పవని చెప్పాలి - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
యువతకు, పిల్లలకు మన పురాణాల గురించి చెప్పాలని సీఎం చంద్రబాబు పిలుపునచ్చారు. స్పైడర్మ్యాన్, బ్యాట్మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలని వ్యాఖ్యానించారు. భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ లో మాట్లాడిన ఆయన… భారత దేశం భవిష్యత్తులో సూపర్ పవర్ గా మారబోతోందని అభిప్రాయపడ్డారు.
మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదికని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం తిరుమలలో నిర్వహించిన సమ్మేళన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన…. ప్రాచీన కాలంలో భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందన్నారు. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందని గుర్తు చేశారు.

2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించిందన్నారు సీఎం చంద్రబాబు. పూర్వ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మనదని చెప్పుకొచ్చారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే అని తెలిపారు.
శ్రీవారి ఆశీస్సులు ఉంటాయి - సీఎం చంద్రబాబు
“అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారు... వీళ్లందరూ మనకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారు. మన భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు... మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోంది. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉంది. పవిత్ర ప్రాంతమైన తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు...వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. విలువలు, నైతికత వంటి అంశాలను పెంపొందించేందుకు మోహన్ భగవత్ వంటి వారు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని… భారత దేశానిది అద్భుతమైన కుటుంబ వ్యవస్థ అని చెప్పుకొచ్చారు. అందరికీ భద్రత కల్పించేలా మన కుటుంబ వ్యవస్థ ఉంటుందన్నారు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నదుల అనుసంధానం జరగాలి…
“గంగా-కావేరీ నదుల అనుసంధానం అనేది జరగాలి... అప్పుడు నీటి భద్రత కలుగుతుంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత దేశం ఛాంపియన్ గా నిలుస్తుంది. ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నాం స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖలో పెట్టబోతోంది” అని వివరించారు.
“స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటివి కాకుండా... మన పురాణాల గురించి పిల్లలకు చెప్పండి. హలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్ప వారని.. వారిని చరిత్రను వివరించాలి.సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలి. మన కృష్ణుని మహిమలు, శివుడి మహత్యం గురించి యువతకు బోధించాలి. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని... రామరాజ్యం గురించి వివరించాలి. అవతార్ సినిమాకంటే మన భారత, రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
“ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాధలతో కూడిన సినిమాలు చేశారు. విలువలను చెబుతూ సినిమాల ద్వారా చైతన్యం తెచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో విలువలు పాటించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. దేశాభివృద్ధికి వాజ్ పేయి పునాదులు వేశారు... ఇప్పుడు ప్రధాని నరేంద్ర అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. వినూత్న ఆలోచనలు చేయాలి... కొత్త ఆవిష్కరణలు చేపట్టాలి” అంటూ చంద్రబాబు ప్రసంగించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











