ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 16వ తేదీన రాష్ట్రానికి రానున్న ఆయన… పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ నేపథ్యంలో చేపట్టే భారీ సభను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేపట్టింది. అమరావతి, విశాఖలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమాలను మించిన స్థాయిలో కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను సక్సెస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో తాజాగానే సీఎం చంద్రబాబు ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ టూర్ లో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైలం భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హజరు కానున్నారు.
భారీ సభ - విస్తృత ఏర్పాట్లు…
కేంద్రం తెచ్చిన జీఎస్టీ -2.0 సంస్కరణలను స్వాగతించి.. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీలో అభినందనల తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ పేరుతో దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తు ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది.
ఈ సభ నిర్వహాణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని పర్యటన సందర్భంగా వాతావరణ పరిస్థితులను చూసుకుని.. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలని... సభకు వచ్చే అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పార్కింగ్ నిమిత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.