కృష్ణా జలాల్లో ఏపీ వాటా కోల్పోయే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి నదీ జలాల వాటాను తీర్పు ఇచ్చే ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని పంపిణీ చేసినట్లు సీఎం తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకం ఏర్పాట్లు కొనసాగాలని… అన్ని జిల్లాలకు నీటి భద్రత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రిజర్వాయర్లలోని నీటి వనరులను న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకూ వీలు లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చట్టపరంగా ఏపీకి దక్కిన వాటా యథాతథంగా కొనసాగించాల్సిందేనని… దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందన్న సీఎం చంద్రబాబు…. వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
నవంబర్ 25 నాటికి రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 1,095 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలమట్టం 7.3 మీటర్ల నుంచి తొమ్మిది మీటర్లకు మెరుగుపడిందని అధికారులు సీఎంకు వివరించారు. భూగర్భ జలమట్టాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
వర్షాలు విస్తారంగా కురిసినా పలుచోట్ల జలాశయాలు ఇంకా పూర్తిస్థాయిలో నిండకపోవడానికి కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భూగర్భజలాలు గతేడాది సగటున 7.45 మీటర్లు ఉండగా.. ఈ ఏడాది 6.8 మీటర్లకు పెరిగాయని వివరించారు.