మెుంథా తుపాను ప్రభావంతో ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావం భారీగా ఉండనుంది. దీంతో ఎక్కువగా ప్రభావితమయ్యే జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

Published on: Oct 26, 2025, 20:16:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెుంథా తుపానుతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పలు జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ నెల 27 నుంచి రెండురోజులపాటు సెలవు ఇచ్చారు. సీఎం చంద్రబాబ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఈ నెల 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితుల ఆధారంగా తర్వాత కూడా సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

ఏపీలో స్కూళ్లకు సెలవు
ఏపీలో స్కూళ్లకు సెలవు

మరోవైపు అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు సెలవులు ఇస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. విద్యా సంస్థలను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. కడప అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో సెలవులు ఇచ్చారు. బాపట్ల, గుంటూరు సెలవులు ఇవ్వగా.. కృష్ణా జిల్లాలో 27, 28, 29 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలో ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

తుపాను తీవ్రతను ఆధారంగా చేసుకుని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఏపీకి ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. తెలంగాణ అంతటా కూడా దీని ప్రభావం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను, ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, మెుంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐఎండీ బులెటిన్‌ల ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని, సోషల్ మీడియాలో ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరం సాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లకు ఫోన్ చేయాలి. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తుపాను గురించి సూచనలు జారీ చేసింది. ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More