ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 32 కేసులు.. మాస్కులు ధరించాలా?

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ 32 కేసులు నమోదవ్వడంతో ఆందోళన నెలకొంది. మళ్లీ మాస్కులు ధరించి తిరగాలా? అంటూ చాలా మంది ఆలోచిస్తున్నారు.

Published on: Jul 23, 2026, 15:20:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 32కి చేరడంతో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంతవరకు ఉంది? తిరిగి మాస్కులు ధరించాల్సిన సమయం వచ్చిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నేషనల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ స్పందిస్తూ.. ఇది ఆసుపత్రులు నిండిపోయి, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే రకం వేవ్ కాదని స్పష్టం చేశారు.

ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు

'కోవిడ్-19 వైరస్ క్రమానుగత వ్యవధిలో వ్యాపించే తత్వం కలిగి ఉంటుంది. అందుకే కేసులలో పెరుగుదల కనిపించడం సాధారణమే. ఒమిక్రాన్ వేవ్ వచ్చిన 2022 తర్వాత నుంచి మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తెచ్చే స్థాయి ఘటనలేవీ నమోదు కాలేదు.' అని ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇలాంటి తాత్కాలిక పెరుగుదల చూస్తున్నామని, ఇది కూడా మరో రెండు నెలల్లో తగ్గిపోతుందని వివరించారు.

వైరస్ వేరియంట్ల గురించి వివరిస్తూ.. 2021లో డెల్టా, 2022లో ఒమిక్రాన్ ప్రభావం చూపాయని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వేరియంట్లన్నీ ఒమిక్రాన్ సంతతికి చెందినవేనని పేర్కొన్నారు. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐదు నమూనాలలో RF.5 సబ్-లైనేజ్ ను గుర్తించారు.

ప్రస్తుతం ఏపీలో గుర్తించిన RF.5 తో సహా వచ్చిపోయే ఉప-వేరియంట్లన్నీ ఒమిక్రాన్ ఉత్పన్నాలేనని, వీటి పేర్లు వేరైనా వీటి లక్షణాలు ఒకేలా ఉంటాయని, ఏదీ కూడా మరొకదాని కంటే తీవ్రమైన వ్యాధిని కలిగించదని వైద్యులు తెలిపారు.

వేరియంట్ల రకాలు: 2022: XBB వేరియంట్, 2023 BA.2.86 (రూపాంతరం చెంది JN.1 గా మారింది), 2024 JN.1 డెరివేటివ్స్, 2025 NB.1.8.1 వేరియంట్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా XFG, BA.3.2, RF.5 వేరియంట్లు ప్రచారంలో ఉన్నాయి. RF.5 అనేది JN.1 యొక్క రూపాంతరం.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ సబ్-లైనేజ్ వల్ల ప్రాణాపాయం లేకపోయినా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ జ్వరం కూడా గుండెపై ఒత్తిడి తెస్తుందని, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.

మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎ. విష్ణు వర్ధన్ మాట్లాడుతూ.. సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల్లో RF.5 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, అయితే ఇది ప్రమాదకరమైనది కాదని చెప్పారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, నీరసం, ఒళ్లు నొప్పులు దీని ప్రధాన లక్షణాలని తెలిపారు.

పరిస్థితిని సమీక్షించేందుకు ఏపీ ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ సంబంధిత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టెస్టింగ్ కిట్లు, మందులు, కోవిడ్ ప్రత్యేక బెడ్లు, పీపీఈ కిట్లు, అత్యవసర వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే స్వల్ప లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More