...
...
Next Story

ఆయుష్‌లో నకిలీ వైద్యులు, చికిత్సలకు చెక్.. క్లినిక్‌లు, ఆసుపత్రుల గుర్తింపు తప్పనిసరి

ఆయుష్‌లో నకిలీ వైద్యులు, చికిత్సలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయుష్ క్లినిక్‌లు, ఆసుపత్రుల గుర్తింపు తప్పనిసరిగా చేస్తోంది.

Updated on: May 11, 2026, 18:23:51 IST
Advertisement

ఆయుష్ వైద్య సేవల్లో మ‌రింత నాణ్యత‌ పెంచేందుకు, మరింత విస్తృతం చేసేందుకు, నకిలీ వైద్యానికి కళ్లెం వేసేందుకు ముఖ్యమైన మార్పులు తీసుకురానున్నామ‌ని వైద్యరోగ్య శాఖ మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ తెలిపారు. సంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యూనాని, నేచురోపతి(ఆయుష్‌) వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్‌ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్‌(రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం-2022కు సవరణ చేశామ‌ని మంత్రి సత్యకుమార్ అన్నారు. చట్టసభల ద్వారా ఈ బిల్లుకు లభించిన ఆమోదానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో కొత్త విధివిధానాలు రాబోతున్నాయ‌ని తెలిపారు. ఈ క్రమంలో విధివిధానాల రూపకల్పనకు మూడు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామ‌న్నారు. టెక్నిక‌ల్ క‌మిటీ, ఎక్స్‌పెర్ట్స్ క‌మిటీ, స్టేక్ హోల్డర్స్ పేర్లతో ఏర్పాటైన క‌మిటీల్లో ముగ్గురు చొప్పున అధికారులు, సీనియ‌ర్ వైద్యులు, నిపుణులున్నారన్నారు.

ఈ క‌మిటీలు ఆయుష్ వైద్య రంగ నిపుణులు, ప్రజ‌ల్ని భాగ‌స్వామ్యం చేసి వారి సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నివేదిక ఆధారంగా చ‌ర్యలు తీసుకోనున్నట్లు మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ తెలిపారు. ఈ నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని మంత్రి వెల్లడించారు. విధివిధానాల ఖ‌రారు ద్వారా రాష్ట్రంలో ప్రసుత్తం అల్లోపతి వైద్యాన్ని అందించే ఆసుపత్రులపై నియంత్రణ ఉన్న మాదిరిగానే ఆయుష్ ఆసుపత్రులపై కూడా ఆయుష్ శాఖకు అధికారాలు సంక్రమిస్తాయి.

ఆయుష్ పరిధిలోనికి వచ్చే ఆయుర్వేద, హోమియో, యూనాని, యోగా అండ్ నేచురోపతి కింద వైద్యాన్ని అందించే సంస్థలపై ప్రస్తుతం ప్రభుత్వపరంగా ఎటువంటి నియంత్రణ లేదు. అర్హతలు కలిగిన వారు మాత్రమే కాకుండా లేనివారు సైతం క్లినిక్ లు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో ఆయుష్ రంగానికి సంబంధించి ఆసుపత్రులు ఉన్నా.. వీటి ద్వారా రోగులు వైద్య సేవలు పొందుతున్నా అధికారికంగా చెప్పేందుకు వీల్లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అచేతనావస్థలో ఉన్న ఆయుష్ వైద్యానికి కూటమి ప్రభుత్వం ఊపిరిపోస్తోంది.

ఈ విధివిధానాల రూప‌కల్పన‌లో భాగంగా కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో అమ‌లులో ఉన్న బెస్ట్ ప్రాక్సీసెస్‌ను కూడా క‌మిటీలు ప‌రిశీలిస్తాయి. టెక్నిక‌ల్ క‌మిటీ ముఖ్యంగా ఆయుష్ ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్‌ను, ఎక్స్‌పెర్ట్ క‌మిటీ రెగ్యులేట‌రీ విధానంపై, స్టేక్ హోల్డర్స్ క‌మిటీ ప్ర‌జ‌ల అభిప్రాయాల్ని తెలుసుకుంటాయి. వీట‌న్నింటినీ క్రోడీక‌రించి చివ‌ర‌గా విధివిధానాల రూప‌క‌ల్పన‌పై ప్రభుత్వానికి నివేదిక‌ను అంద‌జేస్తాయి.

కొత్తగా రాబోయే నిబంధనలు అనుసరించి క్లినిక్‌లు, ఆసుపత్రులు ఆయుష్ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పొందడం వల్ల నిర్దిష్ట ప్రమాణాలు అనుసరించి క్లినిక్‌లు, ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకొస్తాయి.

విద్యార్హతలు కలిగిన వారి ద్వారా మాత్రమే ప్రజలకు ఆయుష్ వైద్య సేవలు అందుతాయి. ప్రస్తుతం ఉన్న నకిలీల బెడద క్రమంగా తగ్గిపోతుంది. అందుబాటులో ఉన్న ప్రాథ‌మిక స‌మాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 2,558 ఆయుర్వేదలో (యూజీ/పీజీ), హోమియోపతిలో (యూజీ/పీజీ)లో 4,599, యూనానిలో 788, నేచురోపతి అండ్ యోగాలో 379 మంది అర్హత కలిగిన వైద్యులు రిజిస్ట్రేషన్ పొందారు. చట్టసవరణ ద్వారా వీరికి మరింత గుర్తింపు పెరుగుతుంది. నకిలీల బెడద తగ్గుతుంది.

నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎన్), నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి (ఎన్సీహెచ్), నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎం) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 1400 వరకు ప్రైవేట్ రంగంలో ఆయుష్ క్లినిక్ లు ఉన్నాయి. 40 వరకు ఆయుష్ ఆసుపత్రులు ఉన్నాయి.. ప్రభుత్వరంగంలో 737 ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో 8 ఆసుపత్రులు ఉన్నాయి. ప్రైవేట్‌ రంగంలో ఉన్న 1,440 క్లినిక్ లు, ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. వీటికి వైద్య ఆరోగ్య శాఖ (ఆయుష్) తరఫున‌ ఎటువంటి గుర్తింపు లేదు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe