తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ భక్తులు వేలాదిగా తరలివస్తారు. వెంకటేశ్వరస్వామి కోసం మొక్కులు చెల్లింస్తుంటారు. కొందరు భక్తులు బంగారం, వెండి, నగదు ఇలా వారికి తోచిన విధంగా స్వామికి కానుకలు ఇస్తుంటారు. అలాగే కొందరు భక్తులు స్వామివారికి భారీ విరాళాలు కూడా ఇస్తుంటారు. ఇటీవలే కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఓ భక్తుడు ఏకంగా రూ. 9 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం మీడియాకు వెల్లడించారు.
2012 లోనూ విరాళం….

పీఏసీ 1, 2 3 భవనాల అధునీకరణ కోసం మంతెన రామలింగ రాజు అనే భక్తుడు రూ.9 కోట్లు విరాళం అందజేశారు. ఆయన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట దీన్ని ఇచ్చారు.ఇదే భక్తుడు 2012లో కూడా టీటీడీకి రూ.16 కోట్లు విరాళమిచ్చారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గుర్తు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం చూపిన ఈ సేవాభావానికి టీటీడీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. స్వామి వారి అనుగ్రహం ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలానే ఆధ్యాత్మిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు.
మరోవైపు ఇటీవలనే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని కోరింది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది.
మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.ఈ విధమైన అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.