డయల్ 112 ఎమర్జెన్సీ సేవలను మూడు విభాగాలతో కలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకట రమణ ఈ విషయాన్ని వెల్లడించారు. డయల్ 112 అత్యవసర సేవను త్వరలో రాష్ట్రంలోని పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలతో అనుసంధానించనున్నట్లు తెలిపారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఈ మూడు విభాగాలు సమన్వయంతో స్పందించే అవకాశం కలుగుతుంది.

రెండు దశాబ్దాల తర్వాత పరికరాల ఆధునీకరణ, కొత్త వాహనాల కొనుగోలుతో సహా, ఈ విభాగంలో చేపడుతున్న భారీ సంస్కరణల్లో భాగంగానే ఈ చర్య తీసుకుంటున్నారు అధికారులు. అనంతపురంలో పర్యటించిన సందర్భంగా కొత్త అగ్నిమాపక వాహనాలను, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వేగవంతమైన స్పందన, ఆధునిక పరికరాల వినియోగం(ఇరుకైన ప్రాంతాల్లో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫోర్-వీలర్ వాహనాలతో సహా) కారణంగా గత ఏడాదితో పోలిస్తే అగ్ని ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని 50 శాతానికి పైగా నివారించగలిగామని తెలిపారు.
అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడటమే అగ్నిమాపక సేవల విభాగం ప్రాథమిక బాధ్యత అని వెంకట రమణ ఉద్ఘాటించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు పరిశ్రమలకు చెందిన ప్రైవేట్ అగ్నిమాపక సేవలను కూడా ప్రభుత్వ అగ్నిమాపక వ్యవస్థతో అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. ఒక్కోటి సుమారు రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో 17 కొత్త అగ్నిమాపక కేంద్రాల భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అందులో ఇప్పటికే ఆరు కేంద్రాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
మరో 36 అగ్నిమాపక కేంద్రాల ఆధునీకరణ పనులు కూడా చేపట్టనున్నట్లు వెంకట రమణ పేర్కొన్నారు. మొదటి దశలో 65 అగ్నిమాపక వాహనాల కోసం రూ.33 కోట్లు మంజూరు చేశామని, రెండో దశలో మరో 58 వాహనాలను కొనుగోలు చేయనున్నామని రమణ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా రూ.252.86 కోట్లతో ఈ విభాగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో 25 అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచినట్లు డీజీ తెలిపారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.