Thalli Bidda Express : తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల డ్రైవర్లుగా మహిళలు.. త్వరలో నియామకాలు!

Thalli Bidda Express Vehicles : తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఇకపై ఈ వాహనాల్లో మహిళా డ్రైవర్లనే నియమించనున్నట్టుగా చెప్పారు.

Published on: Aug 11, 2026, 19:30:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో ఇకపై మహిళా డ్రైవర్లనే నియమించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన 300 కొత్త తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల విభాగాన్ని ఆయన అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.

తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభం
తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభం

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబులతో కలిసి మంత్రి పాల్గొని, ఏరియా ఆసుపత్రిలోని నూతన సదుపాయాలైన డయాలసిస్ యూనిట్లు, ఫిజియోథెరపీ ల్యాబ్‌లు, ఆధునిక లేబర్ రూమ్‌లు, ఆర్‌వో నీటి ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. నూతనంగా ప్రవేశపెట్టిన వాహనాల్లో బాలింతలు, గర్భిణుల సౌకర్యం, భద్రత కోసం పలు విప్లవాత్మక మార్పులు చేసినట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, తక్షణ సాయం కోసం ఎస్ఓఎస్ బటన్ అమర్చారు.

ప్రయాణ సమయంలో గర్భిణులు సులభంగా ఎక్కడానికి ఫుట్ రెస్ట్, హ్యాండ్ రైల్స్, స్లైడింగ్ డోర్లు, చైల్డ్ లాక్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లను అందుబాటులోకి తెచ్చారు. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రత్యేక ఏసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ప్రయాణ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తల్లిపాలు ఇవ్వడం, నవజాత శిశువుల సంరక్షణ, పోషకాహార నియమాలు, టీకాలు, ప్రసవానంతర జాగ్రత్తలపై ప్రభుత్వ మార్గదర్శకాలను తెలియజేసే ఆడియో నిరంతరం ప్లే అయ్యేలా ఆడియో సిస్టమ్‌ను అమర్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ కమిషనర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో సున్నా మాతా మరణాలు లక్ష్యంగా ఆరోగ్య శాఖ పనిచేస్తుందని స్పష్టం చేశారు. టీనేజ్ గర్భధారణలను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఒకవేళ అలాంటి కేసులు నమోదైతే ఆ బాలికలకు ప్రసవ సమయంలో సంపూర్ణ భద్రత, మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడానికి ఈ వాహనాలు ఉచిత సేవలు అందిస్తాయి. అంతేకాకుండా కాంప్లికేషన్లు ఉండే అత్యధిక ప్రమాదం ఉన్న గర్భిణులను త్వరితగతిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి, తక్షణ చికిత్స అందించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ ఉచిత సేవలు కావలసిన వారు 102 నంబరుకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ బాబుతో పాటు బీజేపీ, జనసేన పార్టీల జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More