TTD Ghee Case : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో హవాలా మనీ.. ఎంట్రీ ఇచ్చిన ఈడీ!

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి నెలకొంది.

Published on: Feb 10, 2026 12:29 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో భారీగా ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టుగా సిట్ విచారణలో తేలింది. దీంతో పీఎంఎల్ (Prevention of Money Laundering Act) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. హవాలా మనీ కోణం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారడంపై ఈడీ విచారణ చేయనుంది. మనీ ట్రయల్‌పైనా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తారు.

తిరుమల శ్రీవారి లడ్డూ
తిరుమల శ్రీవారి లడ్డూ

ప్రత్యేక దర్యాప్తు బృందం అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం.. ఈ కేసు హవాలా ఆధారిత నగదు లావాదేవీలు, ప్రైవేట్ పాల సంస్థలు, మధ్యవర్తులు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులకు నెయ్యి టెండర్లు, అనుమతులను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు చెల్లించడం చుట్టూ నడుస్తోంది. హవాలా ఆపరేటర్ల ద్వారా తక్కువ మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు వెల్లడైంది.

పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి వివిధ డెయిరీల డైరెక్టర్లు, టీటీడీ అధికారుల మధ్య నేరపూరిత కుట్ర జరిగిందని సిట్ ఆరోపించింది. అనర్హమైన డెయిరీలు నకిలీ పత్రాలను సమర్పించి, తక్కువ ధరలను కోట్ చేయడం ద్వారా టెండర్లను పొందాయని ఆరోపణలు ఉన్నాయి.

సిట్ ప్రకారం.. ప్రధానంగా భోలే బాబా ఆర్గానిక్ డెయిరీకి చెందిన పోమిల్ జైన్(A-3), విపిన్ జైన్ (A-4) లంచాలు చెల్లించారు. కమిషన్ ఏజెంట్ల ద్వారా నిధులు మళ్లించారు. ఢిల్లీ హవాలా దుకాణాల నుండి విజయవాడ (భరత్ భాయ్ ఠాకూర్), చెన్నై (మదారం దేవాసి), హైదరాబాద్ (అర్జున్ గోస్వామి) ఏజెంట్లకు టోకెన్ ఆధారిత కరెన్సీ వెరిఫికేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి నిధులను తరలించే హవాలా నెట్‌వర్క్ ఉన్నాయని ఛార్జిషీట్ పేర్కొంది.

59,71,781 కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారని, రూ.234.51 కోట్లు దుర్వినియోగం చేసినట్టుగా సిట్ వెల్లడించింది. పోమిల్ జైన్ విలాసవంతమైన ఇంటిని నిర్మించడం, వాణిజ్య ప్లాట్లను కొనుగోలు చేయడం కూడా ఇందులో సిట్ పేర్కొంది. కల్తీపై నెయ్యి ఎక్కువగా కూరగాయల కొవ్వు ఆధారితమైనదని ఛార్జిషీట్ పేర్కొంది. జంతు కొవ్వులను గుర్తించలేదని పేర్కొంది.

నెయ్యి కల్తీ వ్యవహారంలో ఛార్జ్‌షీట్‌లో 36 మందిని నిందితులుగా చేర్చింది సిట్. అందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. టెండర్లలో అక్రమాలు, హవాలా మార్గాల ద్వారా లంచాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా విచారణలో తేలింది. దీంతో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపుపై ఈడీ విచారణ చేయనుంది. త్వరలోనే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.