...
...
Next Story

వివేకా హత్య కేసులో మరో పరిణామం - ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇళ్లపై ఈడీ సోదాలు చేసింది. విపక్షాలను దారి మళ్లించేందుకే ఈ సోదాలని వైసీపీ ఆరోపించింది.

Published on: Aug 21, 2026, 17:57:08 IST
Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

6 చోట్ల తనిఖీలు….

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు (HT_PRINT)
వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు (HT_PRINT)

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు కడపలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ల ఆధారంగానే ఈడీ తమ దర్యాప్తును వేగవంతం చేసింది

వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చిలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రారంభంలో రాష్ట్ర పోలీసులు ఈ కేసును విచారించినప్పటికీ, 2020లో దర్యాప్తు సీబీఐకి బదిలీ అయింది. ఈ హత్య వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలతో సీబీఐ లోతైన విచారణ జరిపి…. హత్య కుట్రలో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలపై వైఎస్ భాస్కర్ రెడ్డిని 2023 ఏప్రిల్ 16న అరెస్ట్ చేసింది.

డైవర్షన్ రాజకీయం - ఈడీ సోదాలపై వైఎస్సార్‌సీపీ

ఈడీ సోదాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తనిఖీలు చేయిస్తున్నారని గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. రాష్ట్రంలో డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు, పోలీసు వాహనంలో గంజాయి దొరకడం, సుగాలి ప్రీతి తల్లి చక్రాల కుర్చీ నిరసనను అడ్డుకోవడం మరియు అధికార పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడి కారు ఢీకొని యువతి మృతి చెందిన హిట్ అండ్ రన్ కేసు వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నప్పుడు, విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు… నిజాన్ని ఎందుకు బయటకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫున పలు కేసుల్లో వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా, వివేకా హత్య కేసులోని నిందితుడి తరఫున కూడా హాజరవుతున్నారని, లాయర్ ఫీజుల కోసం ప్రజాధనాన్ని ఎంత ఖర్చు చేస్తున్నారో పారదర్శకంగా చెప్పాలని డిమాండ్ చేశారు. "వివేకానందరెడ్డి మా నాయకుడు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు. తప్పుడు కథనాలు, డైవర్షన్ రాజకీయాలు ఆపి విచారణ సాగనివ్వండి, నిజం బయటకు రానివ్వండి" అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe