ఏపీ లిక్కర్ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. 7 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. లిక్కర్ పాలసీ విధాన నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేశారు.

ఈడీ విచారణ తర్వాత బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.
“నేను రాజకీయాల నుంచి తప్పుకోను. నా భవిష్యత్ ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తాను. ఈ నెల 25తో నాకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుంది. తిరిగి రాజకీయాల్లోకి వస్తాను” అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
పార్టీలో నంబర్ 2 స్థానం అనేది లేదని స్వయంగా వైఎస్ జగన్ చెప్పారని ఈడీకి తెలిపానని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 అనేది ఉండదని చెప్పానని పేర్కొన్నారు.
“కేసులు చుట్టుముట్టిన తర్వాతే నన్ను ‘నంబర్2’గా ప్రచారం చేశారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నల్లో కొన్ని మాత్రమే రికార్డు చేశారు. మరికొన్ని ప్రశ్నలను రికార్డు చేయలేదు. లిక్కర్ స్కాం గురించి నాకు తెలియదు. లిక్కర్ స్కాంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారినే అడగాలని చెప్పాను” అని విజయసాయి రెడ్డి వివరించారు.
వైసీపీ అధికారం కోల్పోయిన ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి చక్రం తిప్పిన నేతగా పేరొందిన విజయసాయిరెడ్డి… వైసీపీకి రాజీనామా చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. కొద్ది నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీని వీడిన సమయంలో మాట్లాడిన ఆయన… తాను ఏ రాజకీయపార్టీలో చేరబోనని కూడా చెప్పారు. అయితే అనూహ్యంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ప్రశ్నగా మారింది.