భూముల రీసర్వే క్రెడిట్ మాదే... చంద్రబాబుది క్రెడిట్ చోరీ - వైఎస్ జగన్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మోసాలు చేయడం ఈ భూమండలంలో ఒక్క చంద్రబాబుకే సొంతమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ ప్రశ్నాస్త్రాలను సంధించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో అమలు చేసిన భూముల రీసర్వే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు 'క్రెడిట్ చోరీ' చేస్తున్నారని ఆరోపించారు.ఈ భూమండలం మీద ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరంటూ దుయ్యబట్టారు.

గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు నిర్వహించిన తన పాదయాత్రలోనే భూముల రీసర్వేపై హామీ ఇచ్చానని గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… 'వైఎస్సార్ జగన్నన్న శాస్వత భూహక్కు మరియు భూ రక్షా పథకం' (సమగ్ర భూ పునఃసర్వే) రూపొందించినట్లు తెలిపారు.
చంద్రబాబు ఏనాడైనా ఇలా చేశారా..? వైఎస్ జగన్
“మేం అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. రైతులకు, ప్రజలకు వివాదాలు లేనివిధంగా, పారదర్శకంగా భూములు సర్వే చేశాం. ట్యాంపరింగ్ చేయలేని విధంగా భూ యజమానులకు, రైతులకు శాశ్వత పత్రాలు ఇచ్చాం. భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.వందేళ్లక్రితం బ్రిటిషర్ల కాలంలో భూ సర్వే చేశారు. ఆ తర్వాత 2020 డిసెంబర్ 21న భూముల రీ సర్వే ప్రారంభించాం. నాలుగు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏనాడైనా ఇలా చేశారా..? క్రయవిక్రయాలు జరిగినా సమస్యలు లేకుండా చేశాం.. అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగినా ఇబ్బందులు లేకుండా చేశాం” అని వైఎస్ జగన్ వివరించారు.
"యూరప్, అమెరికాలో వాడే టెక్నాలజీతో భూముల రీ సర్వే చేశాం. గ్రామ సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్లు చేశాం. మేం చేసిన భూ సర్వేను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు ఎప్పుడైనా ఇలా చేశారా..? సర్వేలో హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించాం. టెక్నాలజీపై అవగాహన కోసం 40 వేల మందికి శిక్షణ ఇచ్చాం. కోట్ల సంఖ్యలో సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. 5 సెం.మీ కూడా తేడా లేకుండా కొలతలు వేశాం. రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారానికి 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను ఏర్పాటు చేశాం" అని వైఎస్ జగన్ తెలిపారు.
“భూసర్వేకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. 2020, డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. భూ సర్వే కోసం 3640 GNSS ఉపయోగించాం. నిజాలను ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారు. మహారాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారు. సర్వేను .. అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మెచ్చుకున్నారు. అసోం రాష్ట్రం కూడా మా ప్రభుత్వ సహకారం కోరింది. ఎన్నికల సమయంలో IVRS కాల్స్ చేసి రైతులను భయపెట్టారు. మీ భూములు మీకు కాకుండా పోతాయని దుష్ప్రచారం చేశారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు…? మా పని వల్ల కేంద్రం నుంచి రూ. 400 కోట్ల రాయితీ వచ్చింది. భూముల రీ సర్వేకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో ఇచ్చిన పాస్ బుక్ నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. “యూనిక్ నెంబర్, క్యూఆర్ కోడ్ కూడా సేమ్ ఉంది. అన్నీ అవే ఉంచి.. పాస్ పుస్తకాల కలర్ మార్చి ఇస్తున్నారు. చంద్రబాబు చేసిందేమీ లేదు.. కొత్తగా రంగులు మార్చడం తప్ప.. ఇచ్చే చంద్రబాబు పాస్ పుస్తకాల్లో అన్నీ తప్పులు దొర్లుతున్నాయి. వైసీపీ హయాంలో పాతిన కొలత రాళ్లను కోట్లు ఖర్చు చేసి దానిపై ఉన్న పేర్లను చెరిపేస్తున్నారు” అని వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

