అమరావతిలో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరావతిలో ఈ వేడుకలు తొలిసారిగా జరిగాయి

Published on: Jan 26, 2026 10:39 AM IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో మెుదటిసారి వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్‌, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

అమరావతిలో రిపబ్లిక్ డే
అమరావతిలో రిపబ్లిక్ డే

హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు జరిగాయి. పరేడ్‌లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. 22 శకటాలను ప్రదర్శించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మెుదటిసారిగా నిర్వహించింది.

అమరావతి వేలాది మంది రైతుల త్యాగ ఫలితం అని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. ఇది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కలలకు చిహ్నం. రాజధాని కోసం స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చిన రైతుల ధైర్యం, ఈ చారిత్రాత్మక వేడుకల వెనుక ఉన్న నిజమైన శక్తి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అమరావతిలో తొలిసారిగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలను ప్రదర్శించారు. వందేమాతరం, పది సూత్రాల మిషన్, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ, పాఠశాల విద్య, వ్యవసాయ శాఖ, సీఆర్‌డీఏ తదితర విభాగాల శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రూపొందించిన శకటాలు ఉన్నాయి. ఈ వేడుకల్లో అమరావతి రైతులు, స్థానికులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు.

రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రజలకు విషెస్ చెప్పారు. 'సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభ దినోత్సవాన దేశ ప్రజలు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనల్ని మనం పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఘనంగా జరుపుకొందాం. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ.. మనకు ఇచ్చిన రాజ్యాంగం... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పునాదులు వేసింది. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కోరుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.' అని చంద్రబాబు విషెస్ చెప్పారు.

'77వ గణతంత్ర దినోత్సవ శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రతీక. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి పాటుపడదాం.' అని మంత్రి నారా లోకేశ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.