జీహెచ్ఎంసీ విభజనపై మంత్రి పొన్నం క్లారిటీ.. అప్పుడే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం

జీహెచ్ఎంసీ విభజనపై ఫిబ్రవరి 10వ తేదీన ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విభజనలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

Published on: Jan 21, 2026 7:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి , అడిషనల్ కమిషనర్లు , జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం సమీక్ష
జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం సమీక్ష

జీహెచ్ఎంసీలో అభివృధి కార్యక్రమాలు, పెండింగ్ వర్క్స్, శానిటేషన్, హెచ్‌ సిటీ, ఎస్‌ఆర్డీపీ ప్రాజెక్ట్‌లో పలు దశల్లో ఉన్న పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రణాళికల్లో భాగంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించారు. వారి కార్యచరణపై మంత్రి పొన్నం మాట్లాడారు.

ఆ తర్వాత జీహెచ్ఎంసీ విభజనపై మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఫిబ్రవరి 10న ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని తెలిపారు. బల్దియా విభజనలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో చర్చించారు.

హైదరాబాద్ మహానగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లుగా విభజించిన సందర్భంగా ఆయా జోనల్ కమిషనర్లు, సర్కిల్ అధికారులను పరిచయం చేసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల సమస్యలను పరిష్కరించే.. బాధ్యత ఇక మీదట పూర్తిగా అధికారులేదే అని చెప్పారు.

'పారిశుధ్యం, విద్యుత్, తాగునీరులాంటి అంశాల్లో ప్రశ్నించేవారు ఎక్కువ అవుతారు. వారికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. జోనల్ స్థాయిలో అధికారులతో పని చేయించే బాధ్యత కమిషనర్‌దే.' అని మంత్రి పొన్నం అన్నారు.

అంతకుముందు జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 10.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కవాడిగూడ , ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాలు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.