మరో 100 కుక్కలను విషం ఇచ్చి చంపేశారు.. హైదరాబాద్ దగ్గరలోనే ఘటన
తెలంగాణలో కుక్కలను చంపుతున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండగా.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
జంతు ప్రేమికులు కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుక్కలను వందల సంఖ్యలో చంపడంపై ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. మరోవైపు కుక్కలను చంపడం మాత్రం ఆపడం లేదు. హైదరాబాద్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని యాచారం గ్రామంలో 100 కుక్కలకు విషం ఇచ్చి చంపేసిన ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది.

దీంతో స్థానిక సర్పంచ్, మరో ఇద్దరు పంచాయతీ ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వరుస వీధి కుక్కల హత్యలతో తెలంగాణలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జనవరి 6 నుండి అనేక జిల్లాల్లో దాదాపు 500 ఇలాంటి మరణాలు నమోదయ్యాయి.
స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక జంతు సంక్షేమ కార్యకర్త జనవరి 19న కుక్కలకు విషపూరిత పదార్థాన్ని ఇంజెక్ట్ చేశారని యాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు యాచారం గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యుడిపై భారతీయ న్యాయ సంహిత, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు.
దాదాపు 100 కుక్కలు చంపినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథమిక తనిఖీలో దాదాపు 50 జంతువులు చనిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, తదుపరి విచారణ తర్వాత కచ్చితమైన మరణాల సంఖ్యను చెబుతామని అధికారులు తెలిపారు.
ఇటీవల హన్మకొండ జిల్లాలో శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో దాదాపు 300 వీధి కుక్కలను చంపిన ఆరోపణలపై ఇద్దరు మహిళా సర్పంచ్లు, వారి భర్తలతో సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన మరో సంఘటనలో దాదాపు 200 వీధి కుక్కలను చంపినట్లు సమాచారం. దీని ఫలితంగా ఐదుగురు గ్రామ సర్పంచ్లతో సహా ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు అయ్యాయి.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వీధికుక్కల సమస్య నుంచి బయటపడేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత గెలిచిన సర్పంచ్లు ఈ మేరకు వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపుతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్నాయని, బాధ్యులుగా తేలిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

E-Paper












