రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 85.86 శాతం పోలింగ్.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం!

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండో విడత పోరులోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది.

Published on: Dec 14, 2025 7:56 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఆదివారం జరిగిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) తెలిపింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపించింది.

తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికలు (Mission Telangana(X Account))
తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికలు (Mission Telangana(X Account))

తెలంగాణ రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్ఈసీ ప్రకటించింది. 3,911 గ్రామ పంచాయతీలు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వార్డు సభ్యుల పదవులకు 71,071 మంది పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి చేశారు.

54,40,339 మంది అర్హత కలిగిన ఓటర్లలో 46,70,972 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 85.86 శాతం పోలింగ్ నమోదైందని పత్రికా ప్రకటనలో ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అని అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్ పీటీఐకి తెలిపారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2297, బీఆర్ఎస్ మద్దతుదారులు 1191, బీజేపీ 257, ఇతరులు 578 స్థానాల్లో గెలిచారు.

డిసెంబర్ 11న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రెండో దశ కూడా అయిపోయింది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాదరణకు పరీక్షగా మారాయి. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ చర్య చుట్టూ చాలా రోజులు రాజకీయం నడిచింది. కోర్టుల్లో కేసులు నడిచాయి. చివరకు కుదరదనడంతో ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. చట్టపరమైన అడ్డంకుల కారణంగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మాత్రం వాయిదా వేశారు.