పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం - గోదావరిలో నీట మునిగి ఐదుగురు మృతి..!
Gollagudem Godavari River incident : ఏపీలోని పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎటపాక మండలం గొల్ల గూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Polavaram District : పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఉదంతం జిల్లాలోని ఎటపాక మండలం గొల్లగూడెం గ్రామ సమీపంలో జరిగింది.
ప్రాథమిక వివరాల ప్రకారం.... గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చేపల వేట కోసం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలోకి దిగారు. అయితే… ఆ ప్రాంతంలో నది లోతు ఎక్కువగా ఉండటంతో ప్రవాహ ఉధృతికి వారంతా ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయిన ఐదు మృతదేహాలను సిబ్బంది బయటకు వెలికితీశారు. మృతులలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ధృవీకరించారు. వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఒకే ప్రాంతం వారు కావడంతో ఆ గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
చేపల వేటకు వెళ్లిన వారు శవాలై ఇంటికి రావడంతో మృతుల కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఒకేరోజు… ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో గొమ్ముకొత్తగూడెంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి…
గోదావరిలో ఐదుగురు గిరిజనుల మృతి మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

