మెుంథా తుపాను ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్!

మెుంథా తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

Published on: Oct 28, 2025, 17:25:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెుంథా తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. తీరం వైపు దూసుకొస్తున్న కొద్ది పరిస్థితులు మారుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలు పడుతున్నాయి. అక్టోబర్ 29వ తేదీ ఉదయం వరకు ఏపీలోని గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్
ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్

అలాగే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్.. గడిచిన గంటలో 10 కి.మీ వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతుంది. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

తుపాను తీరం దాటే సమయంలో గంటన్నరపాటు ప్రభావం అతిగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని చోట్ల కొండ చరియాలు విరిగి పడతాయని, రాత్రికి మొంథా తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

ఇక గోదావరి జిల్లాల్లో గాలులు తీవ్రంగా ఉన్నాయి. కాకినాడ, యానాం తీరాలు ఉప్పెన ముప్పు ఉందని అంటున్నారు. అంతర్వేదిలో ఈదురుగాలులు విపరీతంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నెలకూలాయి. రోడ్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఇక తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం కోతకు గురైంది. నెల్లూరు మైపాడులో 10 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్నాయి.

కాకినాడ ఓడరేవు వద్ద 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాకినాడ ఓడరేవులో ప్రమాద సిగ్నల్ ఏడు నుంచి 10కి పెంచారు. తీవ్రమైన తుపానుల సమయాల్లో పోర్టుకు జారీ చేసి అతి పెద్ద ప్రమాద సంకేతం ఇది. విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ నంబర్ 9 ఇచ్చారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు ఓడరేవుల్లో ఎనిమిదో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఈ తీవ్ర తుపాను ఈ రాత్రి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. జాతీయ రహదారులపై వాహనాలను పక్కకు నిలుపుకోవాలని అధికారులు హెచ్చరించారు. అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More