AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో పరిణామం - ఏ2 వాసుదేవరెడ్డి అరెస్ట్..!

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సిట్‌ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.

Published on: Feb 22, 2026 7:18 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్నఅప్పటి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సిట్‌ శనివారం అరెస్ట్ చేసింది.

మద్యం కుంభకోణం కేసులో A2 వాసుదేవరెడ్డి అరెస్ట్
మద్యం కుంభకోణం కేసులో A2 వాసుదేవరెడ్డి అరెస్ట్

రిమాండ్ విధింపు…

2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ విధానం అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సిట్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా…. తాజాగా వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా… ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఫిబ్రవరి 9వ తేదీన సిట్‌ అధికారులు వాసుదేవరెడ్డికి నోటీసులిచ్చారు. ఈ మేరకు శనివారం ఉదయం విచారణకు హాజరయ్యారు. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

గత వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన వాసుదేవరెడ్డి నుంచి పూర్తి వివరాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలు, మద్యం సరఫరాదారులకు, ఆ తర్వాత హవాలా యూనిట్లు, షెల్ కంపెనీలకు సరఫరా వంటి అంశాల్లో వాసుదేవరెడ్డి పాత్ర కీలకంగా ఉందని…. ఆయన నోరు విప్పితే చాలా అంశాలు బయటికి వస్తాయని సిట్ భావిస్తోంది.

గత వైసీపీ హయాంలో మద్యం కేటాయింపుల అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును సీఐడీ ప్రత్యేకంగా విచారిస్తోంది. సీఐడీ విచారణ ఆధారంగానే ఈడీ కూడా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కొద్దిరోజుల కిందంటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా సిట్ విచారించింది.