రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ అవకాశం ఉండనుంది. హాల్ టికెట్లను కండక్టర్లకు చూపిస్తే… ఫ్రీగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. తగినన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను నడిపాలని ఆర్టీసీ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఏపీ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరంతా కూడా ఫ్రీ జర్నీ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
AP SSC 2026 పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1, 2026 వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుంది. పాఠశాలలు, ప్రైవేట్ అభ్యర్థులు హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షలు ప్రారంభమయ్యే ముందు విద్యార్థులు వాటిని పొందేలా చూసుకోవాలని అధికారులు సూచించారు.
హాల్ టికెట్లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, పాఠశాల పేరు, పరీక్షా కేంద్రం, సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు, పరీక్ష సూచనలు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. విద్యార్థులు అన్ని సమాచారాన్ని జాగ్రత్తగా ధృవీకరించాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే వారి పాఠశాలకు తెలపాలి. తప్పులు ఏమైనా ప్రింట్ అయితే అవసరమైన చర్యలు పాఠశాల తీసుకుంటుంది.
AP SSC హాల్ టికెట్ - డౌన్లోడ్ ఇలా:
- అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in. ను సందర్శించండి:
- హోమ్పేజీలో “AP SSC హాల్ టికెట్ 2026” లింక్పై క్లిక్ చేయండి.
- యూజర్నేమ్, పాస్వర్డ్ను నమోదు చేయండి.
- క్యాప్చా వెరిఫికేషన్ను పూర్తి చేయండి, వివరాలను సమర్పించండి.
- హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసి ప్రింట్ చేయండి.