ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఎల్బీ నగర్ టూ హయత్నగర్ డబుల్ డెక్కర్ కారిడార్పై అప్డేట్
LB Nagar Hayathnagar Double Decker Corridor : హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు ఇకపై ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ఎల్బీ నగర్ టూ హయత్నగర్ డబుల్ డెక్కర్ కారిడార్పై ప్రణాళికలు వేగవంతమవుతున్నాయి.
ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు ప్రతిపాదిత 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్పై అప్డేట్ వచ్చింది. జాతీయ రహదారి-65పై ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఎల్బీ నగర్-హయత్నగర్ ప్రాజెక్టు పురోగతిని అంచనా వేయడానికి మంత్రి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్వీస్ రోడ్లు, జాతీయ రహదారి, మెట్రో రైలు మౌలిక సదుపాయాల కనెక్టివిటీ, వెడల్పాటి పిల్లర్ల రూపకల్పన, మెట్రో నిర్మాణాలు, స్టేషన్లతో అనుసంధానం వంటి కీలక అంశాలను కూడా సమీక్షించారు.
నాగ్పూర్ తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద డబుల్ డెక్కర్ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టులలో ఇది ఒకటి అవుతుందని వెంకట్ రెడ్డి అన్నారు. ఈ మార్గంలో తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ప్రమాద రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్థానిక రాకపోకల కోసం సర్వీస్ రోడ్లు ఉండగా.. ప్రధాన వాహనాలు ఎలివేటెడ్ లెవెల్స్పై ప్రయాణిస్తాయి. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్లే వాహనాలు దాదాపుగా ఈ కారిడార్ మీదుగానే వెళ్తాయి.
రూ. 941 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇందులో తమ వాటాగా రూ. 200 కోట్లు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
ఈ ప్రాజెక్టును వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అనుమతులను వేగవంతం చేసి, టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అనుమతులు కోరేందుకు వచ్చే వారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారితో సమావేశమవుతానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
ఈ కారిడార్ పూర్తయిన తర్వాత, ఎల్బీ నగర్, హయత్ నగర్లోని 54 కాలనీలలో నివసిస్తున్న దాదాపు 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఇది రద్దీని తగ్గించి, రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. అలాగే హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారు 15 నిమిషాల లోపు నగరాన్ని దాటేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


