ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!

రాబోయే ఐదు సంవత్సరాలలో విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్‌ను ఏర్పాటు చేయనుంది.

Published on: Oct 14, 2025, 12:38:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్‌ను ఏర్పాటు చేయనుంది గూగుల్. రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ మంగళవారం తెలిపింది. ఇది అమెరికా వెలుపల దాని అతిపెద్ద ఏఐ హబ్. ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

'ఇది అమెరికా వెలుపల మేం పెట్టుబడి పెట్టే అతిపెద్ద ఏఐ హబ్.' అని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు.

విశాఖపట్నంలో 1-గిగావాట్ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మిస్తుంది గూగుల్. ఏఐ మౌలిక సదుపాయాల బేస్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

'ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ విశాఖలో అడుగుపెడుతోంది. అప్పుడు హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని అభివృద్ధి చేశాం. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం. ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం. ప్రస్తుతం విశాఖకు గూగుల్‌ తెస్తున్నాం. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైమ్ డేటా కలెక్షన్లు అవసరం.' అని చంద్రబాబు అన్నారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ మన లక్ష్యమన్నారు. స్మార్ట్ వర్క్ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఐదు సంవత్సరాలలో గూగుల్ 15 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టడం సంతోషదాయకమన్నారు.

ప్రాజెక్టుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. ఆసియాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న పెద్ద ప్రాజెక్టు ఇది. దీనితో 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10 వేల కోట్లకుపైగా సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. గూగుల్‌ క్లౌడ్‌ ఆధారిత కార్యక్రమాలతో ప్రతీ ఏటా.. రూ.9,553 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More