Tirumala Tirupati updates : కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో సప్తగిరులు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని గదులు, నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లు గోగర్భం డ్యాం సర్కిల్ సమీపంలోని ఆక్టోపస్ భవనం వెలుపల వరకు విస్తరించాయి.

టోకెన్లు లేని భక్తులకు ఉచిత సర్వదర్శనం (సర్వదర్శన భక్తులు) కోసం దాదాపు 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీని క్రమబద్ధీకరించడానికి అధికారులు ప్రస్తుతం భక్తులను బాట గంగమ్మ ఆలయం గుండా సర్వదర్శన క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.
గంటల తరబడి లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు నిరంతరాయంగా అల్పాహారం, తాగునీరు, పాలు, కాఫీలు అందజేస్తున్నారు. వసతి గదుల కోసం సీఆర్వో (CRO) కార్యాలయం వద్ద, తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్టల వద్ద భక్తులు భారీగా బారులు తీరారు.
నిన్నటి లెక్కలు ఇవే:
జూన్ 12, 2026 శుక్రవారం నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, తలనీలాలు, లడ్డు విక్రయాలు మరియు హుండీ కానుకల వివరాలను టీటీడీవిడుదల చేసింది.
- మొత్తం దర్శనాలు: నిన్న ఒక్కరోజే 74,636 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
- శ్రీవారి హుండీ ఆదాయం: భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీకి రికార్డు స్థాయిలో రూ. 4.64 కోట్ల ఆదాయం లభించింది.
- లడ్డూల విక్రయం: తిరుమల ప్రసాదమైన శ్రీవారి లడ్డూలకు భారీ డిమాండ్ ఏర్పడింది. శుక్రవారం నాడే రికార్డు స్థాయిలో 4.21 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.
- తలనీలాలు: స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు 43,084 మంది భక్తులు కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించారు.
- అన్నప్రసాదం: వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నప్రసాద భవనాల్లో కలిపి నిన్న 3.18 లక్షల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
- వైద్య సేవలు: తిరుమలలోని వివిధ అశ్విని ఆసుపత్రులు, ప్రథమ చికిత్స కేంద్రాలలో నిన్న ఒక్కరోజే 4,253 మంది భక్తులకు వైద్యులు ఉచితంగా వైద్య చికిత్స అందించారు.
రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికతో వ్యవహరించి… అధికారులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
{{/usCountry}}రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికతో వ్యవహరించి… అధికారులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
{{/usCountry}}