టీటీడీ ఆధ్వర్యంలోని 33 విద్యాసంస్థల్లో అడ్మిషన్ కమిటీలు.. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు!
టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు తెలిపారు. 33 విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు సమగ్ర ఏర్పాట్లు చేసినట్టుగా వెల్లడించారు. మెరిట్, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రవేశాల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయం నుండి టీటీడీ డీఈవో వెంకటసునీల్తో కలిసి కళాశాలల ప్రిన్సిపల్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ.. ఆలయాల నిర్వహణతోపాటు విద్యా రంగానికీ సమాన ప్రాధాన్యతనిస్తూ టీటీడీ ఏడు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. తిరుపతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. విద్య ద్వారా యువతలో ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు, ఉత్తమ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయని వివరించారు.
టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను మెరిట్, పారదర్శకత, జవాబుదారీతనం అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జేఈవో తెలిపారు. అడ్మిషన్ల నిర్వహణ కోసం ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా, పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.
కోర్సుల వారీగా సీట్ల లభ్యత, ఖాళీల భర్తీ, స్పాట్ అడ్మిషన్ల నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు జేఈవో. అడ్మిషన్ ఫీజులను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే స్వీకరించాలని, విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల, బాలమందిరం, బధిరుల పాఠశాల తదితర ప్రత్యేక విద్యాసంస్థల అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటనలు, ఫ్లెక్సీలు, డిజిటల్, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ డీఈవో వెంకటసునీల్ పాల్గొనగా, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


