కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు తమ భక్తిని రకరకాలుగా చాటుకుంటారు. స్వామి వారి సేవలతో పాటు సమాజంలో నిరుపేదలకు మేలు జరిగేలా టీటీడీ నిర్వహించే పలు ట్రస్ట్లకు విరాళాలు ఇస్తుంటారు. తాజాగా దరాబాద్కు చెందిన ఓ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు ఆదివారం రూ. 1 కోటి భారీ విరాళాన్ని అందజేశారు.
ఈవోకు డీడీ అందజేత…

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాద్కు చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అన్నే శ్రీనివాసరావు ఈ విరాళాన్ని ఇచ్చారు. తిరుపతిలోని టీటీడీ ఈఓ క్యాంప్ కార్యాలయంలో రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూ. 1 కోటి విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను ఈఓకు స్వయంగా అందజేశారు.
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేద రోగులకు ప్రాణదాన ట్రస్ట్ ద్వారా టీటీడీ ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తోంది. గుండె, మూత్రపిండాలు (కిడ్నీ), మెదడు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులతో బాధపడే పేద ప్రజలకు ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.
నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉన్నత లక్ష్యంతో టీటీడీ ఈ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతోమంది పేద రోగులకు ఈ ట్రస్ట్ పునర్జన్మను ప్రసాదిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా పేరొందిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అధికారిక నిర్వహణ బాధ్యతలను టీటీడీ చూసుకుంటోంది. ఆలయానికి వచ్చే కానుకలు, విరాళాలను ఇటువంటి సామాజిక, సేవా కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తూ వినియోగిస్తోంది.