జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశాను.. విడుదల తర్వాత అంబటి రాంబాబు కామెంట్స్

మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు.

Published on: Feb 18, 2026 9:09 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో అంబటి ఉన్నారు. ఒక కేసులో అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్‌ మంజూరై విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్‌ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన కేసులో పీటీ వారెంట్‌ జారీచేశారు. తాజాగా ఈ కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

అంబటి రాంబాబు విడుదల
అంబటి రాంబాబు విడుదల

2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లాటరీ కేసులో అంబటి రాంబాబు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుతోపాటుగా జనవరి 31న గుంటూరులో జరిగిన నిరసన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దుర్భాషలాడడం, పోలీసు సిబ్బంది విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటి కేసుల్లో ఆయన 17 రోజుల రిమాండ్‌ను అనుభవించారు.

గుంటూరు నగరంలో టీడీపీ మద్దతుదారులు ఆయన ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ ఆ రోజు ఆయన ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయనను అరెస్టు చేశారు.

విడుదలైన తర్వాత అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. 'జనవరి 31న గుంటూరులో నా ఇల్లు, కుటుంబంపై దాడికి చంద్రబాబు, లోకేష్ కుట్ర పన్నారు. దాడి చేసిన వారిని నిరోధించకుండా అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్షకులుగా మిగిలిపోయారు.' అని అన్నారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం కొనసాగిస్తానని రాంబాబు చెప్పారు. జైలులో తనకు ఎలాంటి ప్రత్యేక మర్యాదలు ఆశించలేదన్నారు. సౌకర్యాల గురించి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా రిమాండ్ వ్యవధిని అనుభవించానని చెప్పారు. రాబోయే రోజుల్లో తన ఇల్లు, కుటుంబంపై జరిగిన దాడి గురించి మాట్లాడుతానని తెలిపారు.

'నేను విడుదల కాకుండా కొందరు వ్యవహరించారు. నాపై నమోదైన కేసుల వెనక రాజకీయ కక్ష సాధంపే కారణం. నా కుటుంబ సభ్యులను సైతం వేధించారు. బాధితుడిని జైలులో ఉంచి, నిందితులను బయట ఉంచిన పరిస్థితి ఏర్పడింది. జరిగిన అన్యాయానికి దేవుడే తీర్పు చెబుతాడు. న్యాయం ఆలస్యమైనా తప్పకుండా గెలుస్తుంది. ఎన్ని రోజులైనా జైళ్లో ఉండాలని వెళ్లాను. జైలు అంటే భయపడే వ్యక్తిని కాదు. జైలు శిక్షణా కేంద్రం లాంటిది. నేను జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశారు.' అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.