AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంతో APSDMA హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలలో 2 రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Published on: Sep 10, 2026, 12:13:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగాళాఖాతంలో చోటుచేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారింది. ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అల్పపీడనం (Low Pressure Area) బలపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వర్షాలు

ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో మరింత వేగంగా కదిలే అవకాశం ఉండటంతో తీర ప్రాంత జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో రానున్న 48 గంటల పాటు వాతావరణం ముబ్బుపట్టి ఉంటుందని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల వర్షాలు కూడా పడుతాయి.

ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా విస్తారంగా తుఫాను గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో గాలుల వేగం గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లకు చేరే ప్రమాదం ఉంది.

బంగాళాఖాతంలో అల్పపీడనంతో సముద్రంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. అలల తీవ్రత ఉండటంతో రాబోయే 48 గంటల పాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీరానికి చేరువలో ఉండే మత్స్యకార గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రంలోకి ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సమీప తీరాలకు తిరిగి రావాలని, తమ పడవలు, వలలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని కోరారు.

తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం స్థానిక రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారుల హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More