Monsoon : నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు ముందు పవర్​ఫుల్​ స్పెల్- తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులు భారీ వర్షాలు..

నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించే ముందు చివరిసారిగా తమ ప్రతాపాన్ని చూపించనున్నాయి! సెప్టెంబర్ 12 నుంచి 21 మధ్య దక్షిణ, మధ్య, తూర్పు, పశ్చిమ భారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఆ వివరాలు..

Published on: Sep 9, 2026, 07:29:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది వర్షాకాలం ఆఖరి ఘట్టానికి చేరుకుంటున్న వేళ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. భారత్ నుంచి నైరుతి రుతుపవనాలు అధికారికంగా వైదొలిగే ముందు, దేశవ్యాప్తంగా మరొకసారి పవర్​ఫుల్ స్పెల్ రాబోతోంది. సెప్టెంబర్ 12 నుంచి 21 మధ్య కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ నమూనాలు స్పష్టం చేస్తున్నాయని వివరించింది.

నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్​తో వర్షాలు..
నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్​తో వర్షాలు..

సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు సాగే నైరుతి రుతుపవనాల కాలంలో ఈ చివరి వర్షపు జల్లులు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి.

నైరుతి రుతుపవనాలు.. ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు?

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్ పంపిన తాజా చిత్రాల ప్రకారం.. దేశంలో వాయవ్య భాగంలో మేఘాల సాంద్రత తగ్గినప్పటికీ, తూర్పు- దక్షిణ భారత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షపు మేఘాలు చురుగ్గా ఉన్నాయి.

ఈ క్రమంలో సెప్టెంబర్ రెండో అర్ధభాగంలో:

దక్షిణ భారతదేశం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాలు.

మధ్య, తూర్పు భారత్: ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్.

పశ్చిమ భారత్: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

14 శాతం వర్షపాత లోటు.. ఎల్ నినో ప్రభావం ఎంత?

ఈసారి నైరుతి రుతుపవనాలు సమూలంగా ఒకేలా సాగలేదు. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడితే, మరికొన్ని ప్రాంతాలు తీవ్ర లోటును పరిస్థితులను ఎదుర్కొన్నాయి.

కాగా ఇప్పటివరకు నమోదు అయిన గణాంకాల ప్రకారం దేశంలో సాధారణ వర్షపాతం కంటే 14 శాతం లోటు నమోదైంది.

దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘ఎల్ నినో’ ప్రభావమేనని నిపుణులు చెబుతున్నారు. ఎల్ నినో కారణంగా రుతుపవనాల వ్యవస్థ బలహీనపడటంతో, వర్షాలు ఒకేచోట కురవకుండా తీవ్రమైన ప్రాంతీయ వ్యత్యాసాలను చూపించాయి.

రైతన్నకు కీలక సమయం.. పంటలకు ఉపశమనం లభిస్తుందా?

సెప్టెంబర్ నెలలో పడే వర్షాలు వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా వర్షాధార పంటలకు జీవనాడి వంటివి!

నేలలో తేమ: సుదీర్ఘమైన ఎండల తర్వాత వచ్చే ఈ వర్షపు జల్లులు నేలలో తేమ శాతాన్ని పెంచుతాయి.

పంట దిగుబడి: పంటలు కోత దశకు వచ్చే ఈ సమయంలో వర్షాలు పడితే దిగుబడి దెబ్బతినకుండా ఉంటుంది.

ఒకవేళ సెప్టెంబర్ ఆఖరి వారంలో వర్షాలు ముఖం చాటేస్తే, అది గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ..

సెప్టెంబర్ 21 తర్వాత వచ్చే ఈ వర్షాల స్పెల్ ముగిసిన వెంటనే, వాయవ్య భారతదేశం (రాజస్థాన్, పంజాబ్) నుంచి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం కానుంది. అక్కడి నుంచి క్రమంగా దక్షిణ, తూర్పు దిశగా రుతుపవనాలు వెనక్కి తగ్గుతాయి.

కాబట్టి రాబోయే 10 రోజుల వర్షపాతమే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో పడే ఆఖరి ప్రధాన వర్షాలుగా భావించవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More