రాష్ట్రంలో ఇవాళ (మే 13) విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. ఒకవైపు అల్పపీడన ప్రభావంతో వర్షాలు, మరోవైపు భానుడి భగభగలతో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
11 జిల్లాలకు వర్ష సూచన:

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు. గుంటూరు, బాపట్ల, నెల్లూరు. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చు.
వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సచించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత:
వర్ష సూచన ఉన్నప్పటికీ…. మన్యం, ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అల్లూరి జిల్లాలోని జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. అలాగే పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రాకూడదని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వడగాలులు వంటి పరస్పర విరుద్ధ వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల ప్రజలు తమ ప్రయాణాలను…. పనులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.