ఇక్కడ చదువుకున్నవారికి ఇక్కడే ఉద్యోగాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ : సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సర్వనాశనమైందని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకుంటే మనకు నష్టమని చెప్పారు.
అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మూడు లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చవల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టపోయామని చెప్పారు.

ఇల్లు అంటే భవిష్యత్తుకు భద్రతా అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మూడు లక్షల ఇళ్లను అప్పగిస్తున్నట్టుగా వెల్లడించారు. ఉగాది నాటికి మిగిలినవి పూర్తి చేసి అప్పగిస్తామన్నారు. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తామని చెప్పారు.
'ఇళ్ల మీద సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తాం. నివాసాలు, పొలాల్లో కరెంట్ తయారు చేయిస్తున్నాం. సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమలో 90 శాతం రాయితీకి డ్రిప్ పరికరాలు అందించాం. ప్రకాశం జిల్లా కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశాం. ప్రతీ కుటుంబంలో ఒక్క పారిశ్రామిక వేత్త తయారు కావాలి. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది.' అని సీఎం చంద్రబాబు అన్నారు.
కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చంద్రబాబు అన్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకు పని చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల పేర్లను నమోదు చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడానికి కృషి చేస్తున్నామన్నారు. 2029నాటికి ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తన లక్ష్యమన్నారు. రాష్ట్రానికి మరింత పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు తెలిపారు. ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇక్కడ నుంచి పనులు చేసుకోవచ్చని వెల్లడించారు.
నదుల అనుసంధానంపై చంద్రబాబు మాట్లాడారు. ఇది తన జీవితాశయమని చెప్పారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడూ తాను నిర్లక్ష్యంగా ఉండనని స్పష్టం చేశారు. శ్రీనివాసమంగపురం రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. చెరువులను నింపి భూగర్భ జలాలను పెంచడం లక్ష్యమన్నారు.













