ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్‌ విధానం ఉండాలి : జస్టిస్ బీఆర్ గవాయ్

పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే.. కోర్టులను ఆశ్రయించే హక్కును రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

Published on: Nov 16, 2025, 15:56:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సీకే కన్వెన్షన్‌లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 'ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ ఇన్స్‌స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్' అనే అంశంపై ప్రసంగించారు. తాను హాజరైన చివరి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో జరిగిందని, ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత మొదటిది మహారాష్ట్రలోని తన స్వస్థలం అమరావతిలో జరిగిందని గుర్తు చేశారు.

జస్టిస్ బీఆర్ గవాయ్
జస్టిస్ బీఆర్ గవాయ్

'భారత రాజ్యాంగానిది 75 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం. రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. న్యాయవాద ప్రస్థానం అమరావతిలో ప్రారంభమైంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన తర్వాత తొలిసారి ఏపీ రాజధాని అమరావతికి వచ్చాను. ఇక్కడకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమరావతికి గొప్ప చారిత్రాత్మక గుర్తింపు ఉంది.' అని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.

మహారాష్ట్రలోని అమరావతిని ఇంద్రపురిగా పిలుస్తారని, ఏపీలోని ఇక్కడి అమరావతిలో కూడా ఇంద్రుడు తిరిగిన నేలగా ప్రసిద్ధి చెందిందన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగం రక్షణ కల్పించిందన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ.. అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

'సామాజిక, ఆర్థిక సమానత్వం సాధనే లక్ష్యంగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. పౌరులకు సమానంగా ఎదిగేలా అవకాశాలను రాజ్యాంగం కల్పించింది. మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా మహిళలకు సమాన అవకాశాలు రాజ్యాంగంలో కల్పించారు. కొన్ని అంశాల్లో సవరణ సులభం.. కొన్ని అంశాల్లో కఠినం. రాజ్యాంగం అమలులోకి వచ్చిన మరుసటి ఏడాది రిజర్వేషన్ల అంశంపై మెుదటి సవరణ చేసుకున్నాం.' అని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.

రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీం కోర్టుకు మెుదటిలో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. కేశవానంద భారతీ కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. 1975 వరకు ఆదేశిక సూత్రాల కంటే.. ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేదన్నారు. కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతోపాటుగా ఆదేశిక సూత్రాలకు సమ ప్రాధాన్యం దక్కిందన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండరాదని విశాఖ కేసు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని చెప్పారు.

షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) లలో కూడా క్రీమీలేయర్‌ను గుర్తించడానికి, వారికి రిజర్వేషన్ ప్రయోజనాన్ని నిరాకరించడానికి రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలని గతంలో అభిప్రాయపడ్డారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More