Gas Cylinder : నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌పీజీ కొరత ఉందా? ప్రభుత్వం ఏం చెబుతోంది?

LPG Cylinder in AP : దేశంలో ఇప్పుడు ఎల్‌పీజీ గురించే చర్చ. ఎల్‌పీజీ సిలిండర్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హోటళ్ల యజమానులు ఇప్పటికే చెబుతున్నారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది.

Updated on: Mar 10, 2026 10:14 PM IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్లపై ఆందోళన నెలకొంది. ఓ వైపు ప్రభుత్వాలు సరిపోయేంత ఎల్పీజీ ఉందని చెబుతున్నాయి. కానీ మరోవైపు చాలా మంది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీనిద్వారా అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌పీజీ పరిస్థితిపై ప్రభుత్వం స్పందించింది.

గ్యాస్ కొరతపై ప్రభుత్వం క్లారిటీ
గ్యాస్ కొరతపై ప్రభుత్వం క్లారిటీ

ఏపీలో ఎల్‌పీజీ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు భయపడవద్దని కోరారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్ సరఫరా, స్టాక్ స్థాయిలను సమీక్షించిన తరువాత, ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ, మంగళూరు నుండి హసన్ చర్లపల్లి పైప్‌లైన్, విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసి సౌకర్యాల నుండి ఎల్‌పీజీ సరఫరాను ట్రాక్ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

ఎల్‌పీజీ అక్రమ మళ్లింపు, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

ధరల పెరిగాయని, పుకార్లు వ్యాప్తి చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాల వారీగా సరఫరా గొలుసును పర్యవేక్షిస్తామని మనోహర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోరని హామీ ఇచ్చారు. కొనసాగుతున్న అంతర్జాతీయ యుద్ధ పరిస్థితి ఇప్పటివరకు ఎల్‌పీజీ సరఫరాను ప్రభావితం చేయలేదని పునరుద్ఘాటించారు.

ప్రభుత్వం ఎలాంటి సమస్య లేదని చెబుతున్నా.. పలువురు మాత్రం బ్లాక్ మార్కెట్‌లో దండుకుంటున్నారు. ఏపీలోని అనేక జిల్లాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లను పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హోటళ్లు అధిక ధరలకు సిలిండర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. పశ్చిమాసియా యుద్ధ భయాలను చూపిస్తూ పలువురు సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. కొంతమంది ఎల్పీజీ పంపిణీదారులు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అనధికారిక మార్గాల ద్వారా సిలిండర్లను అమ్మేస్తున్నారు. వారం క్రితం వరకు దాదాపు రూ.2,200కి లభించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో రూ.3,200 వరకు అమ్ముడవుతోంది.

స్టాక్ అయిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, అధిక ధరలకు సిలిండర్లను ఏర్పాటు చేస్తామని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో గృహ వినియోగం కోసం ఉద్దేశించిన ఎల్పీజీ సిలిండర్లను చట్టవిరుద్ధంగా వాణిజ్య సిలిండర్లలో నింపి హోటళ్లకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ధరలను పెంచడానికి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఇప్పటికే వేలాది సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌లోకి ప్రవేశించాయని సమాచారం.

గృహ ఎల్పీజీ ధరలను కూడా పెంచేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. బ్లాక్‌లో సిలిండర్‌కు రూ.1500 దాటిపోతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ వార్ గ్యాస్ ధరలపై చూపిస్తుందనే భయం మెుదలైంది. ప్రభుత్వం ఇటీవల ఎల్బీజీ సిలిండర్ల ధరలను పెంచింది. రీఆర్డరింగ్ నిబంధనలను కూడా కఠినం చేసింది. భారతదేశం ఎల్పీజీ డిమాండ్‌లో ఎక్కువ శాతం దిగుమతుల ద్వారా తీరుస్తుంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుండి ఎల్బీజీ వస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More