సంక్రాంతి కోడిపందేలు.. రూ.1.53 కోట్ల గెలుచుకున్న రాజమండ్రి రమేశ్ డేగ!
ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక కోడిపందేల వద్ద జనాలు పెద్ద ఎత్తున వచ్చి చేరారు. కోట్ల రూపాయల్లో పందేలు జరిగినట్టుగా తెలుస్తోంది.
నిషేధం, పదే పదే హెచ్చరికలు ఉన్నప్పటికీ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో కోడిపందేలు నిర్వహించారు. నిర్వాహకులు, పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినప్పటికీ, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కోడిపందేల్లో పందెం వేయడంతో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు చేతులు మారాయి.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. కోడి పందేలు, జూదం కార్యకలాపాలను నిర్వహించవద్దని హెచ్చరికలు ఉన్నా.. ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ప్రముఖులు సైతం హాజరై సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణతోపాటుగా ఇతర రాష్ట్రాల జనాలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. కోడి పందేల బరుల వద్ద ఉత్సహంగా కనిపించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు కూడా కోడి పందేలు వీక్షించారు. రాత్రంతా కోడి పందేలు నిర్వహించడానికి నిర్వాహకులు జనరేటర్లు, ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. మహిళలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఉన్నాయి.
ఇక కోడి పందేల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందుకు తాడేపల్లిగూడెంలో జరిగిన పందేమే ఉదాహరణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడిపందేలు భారీగా సాగాయి. కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా సమాచారం. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో హైలెట్ అయ్యాయి.
ఎందుకంటే ఇక్కడ ఏకంగా రూ.1.53 కోట్ల భారీ పందెం జరిగింది. ఈ పందెం గుడివాడ ప్రభాకర్ సేతువ, రాజమండ్రికి చెందిన రమేశ్ డేగ మధ్య జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో రాజమండ్రి రమేశ్ డేగ విజయ సాధించింది. రమేశ్ రూ.1.53 కోట్లు గెలుచుకున్నాడు. ఈ పందెం వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. తాడేపల్లిగూడెం మాత్రమే కాదు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి ప్రాంతాల నుంచి కూడా కోళ్ల పందేలు చూసేందుకు వచ్చారు.
కోడిపందేలు అనగానే.. కేవలం పోటీ మాత్రమే అనుకోవద్దు. దీనికోసం చాలా కసరత్తు ఉంటుంది. కోళ్లను చాలా జాగ్రత్తగా సిద్ధం చేయడమే కాదు.. ఖగోళశాస్త్రం, జ్యోతిష్యం లెక్కలు కూడా చూసుకుంటారు పందెంరాయుళ్లు. నక్షత్రంవంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా జరిగాయి.

E-Paper












