గురుకులాల్లో బీసీ హాస్టళ్లు విలీనం.. ఎంజేపీలకు శాశ్వత భవనాలు

రూ.500 కోట్లతో ఎంజేపీలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి సవిత తెలిపారు. రూ.80 కోట్లతో అసంపూర్తి ఎంజేపీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

Published on: Aug 18, 2026, 05:50:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రూ.500 కోట్ల సాస్కి నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. వర్షా కాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలిచ్చారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

నాణ్యమైన విద్యను అందిస్తున్న బీసీ గురుకులాలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు మంత్రి సవిత. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ బీసీ గురుకులాల భవనాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో, మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. ఆరు బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. బీసీ బాలికల డ్రాపౌట్ల నివారణకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు.

50 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న బీసీ హాస్టళ్లను గురుకులాల్లో విలీనం చేస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత ఏపీలో 32 బీసీ గురుకులాలు మాత్రం ఉన్నాయని, 2014-19 మధ్య 75 బీసీ గురుకులాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని మంత్రి సవిత గుర్తు చేశారు. వాటిలో 25 ఎంజేపీలకు శాశ్వత భవనాల కోసం రూ.40 కోట్లను ఆనాడు మంజూరుచేయగా, 70 నుంచి 80 శాతం మేర పనులు సైతం పూర్తయ్యాయని అన్నారు. తరవాత వచ్చిన ప్రభుత్వం బీసీ గురుకులాలను పట్టించుకోకుండా గాలి కొదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసంపూర్తి గా నిలిచిపోయిన భవనాలకు నిధులు మంజూరు చేసిందన్నారు.గోనబావి, మడకశిర, రొద్దం, పులివెందుల సహా పలు ప్రాంతాల్లో ఉన్న గురుకులాల పనులు పున:ప్రారంభించామని, త్వరలోనే వాటిని పూర్తి చేసి బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని తెలిపారు.

బీసీ హాస్టళ్లలో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. సీఎస్ఆర్, డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ ద్వారా హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను వేరే భవనాల్లోకి షిఫ్ట్ చేశామన్నారు. హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణకు 1,291 మంది పారిశుధ్య సిబ్బందిని, 142 మంది కుక్, కమాటీలను నియమించామని తెలిపారు. 2026-27 బడ్జెట్ లో హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు కేటాయించామన్నారు. 2019-24 మధ్య ఆనాటి ప్రభుత్వం హాస్టళ్ల కనీస మరమ్మతులకు, వసతులకు నిధులు కూడా కల్పించలేదని మంత్రి సవిత తెలిపారు.

రూ.9.75 కోట్లతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ భవనానికి సంబంధించి అంచనాలు కూడా ఇప్పటికే రూపొందించామని, అనుమతులు రాగానే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో భీమిలి ఎంజేపీ సహా 70 నుంచి 80 శాతం మేర అసంపూర్తి గా నిలిచిపోయిన ఎంజేపీ భవనాల నిర్మాణాల పూర్తికి కూటమి ప్రభుత్వం రూ.80 కోట్లు కేటాయించిందన్నారు. ఆరు నెలల్లో ఈ ఎంజేపీ భవనాలను బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని మంత్రి సవిత తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More