ఇవాళ అమరావతికి బిల్ గేట్స్ - పలు అంశాలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్
గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సంజీవని సహా సాంకేతిక సాగు ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం(ఇవాళ) రాష్ట్రంలో పర్యటించనున్నారు. బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6గురు ప్రతినిధుల బృందం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి రానుంది.

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి బిల్ గేట్స్ బృందం కొద్దిసేపు సమావేశం కానుంది. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు.
ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని కూడా గేట్స్ పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం కానున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్….
రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.
అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలిస్తారు.

E-Paper












