రాష్ట్రంలో 72 లక్షల మందికి వైద్య పరీక్షలు.. సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్రానికి బిల్ గేట్స్!

రాష్ట్రంలో 72 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు.

Published on: Feb 2, 2026, 10:45:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు. కుప్పం నియోజకర్గం శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ గ్రామంలోని ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను స్వయంగా పరిశీలించారు. సంజీవని ప్రాజెక్టు అమలు గురించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వివిధ అంశాలను తెలుసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

త్వరలో బిల్ గేట్స్ రాక

గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యారోగ్య శాఖ రూపొందించిన డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వివిధ ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు చంద్రబాబు. వారి ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు నిపుణులైన వైద్యులతో పాటు ఔషధాలను ఇచ్చేలా సంజీవని ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అత్యుత్తమ టెక్నాలజీ ద్వారా ప్రజల ఆరోగ్య అంశాలను పర్యవేక్షించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ సహకారంతో ఈ డిజినెర్వ్ సెంటర్ ద్వారా ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు అమలుతో పాటు మరిన్ని రంగాల్లో సహకారం అందించేందుకు త్వరలోనే బిల్ గేట్స్ రాష్ట్రానికి రానున్నారని సీఎం వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా సంజీవని

కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంజీవని చిత్తూరు జిల్లాకు విస్తరించామని.. ఈ ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో నమోదు అయిన వైద్య పరీక్షల వివరాలను డిజిటల్‌గా మార్చామని అన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలను విశ్లేషించి చికిత్సలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సంజీవని సేవల్ని సమర్ధంగా వినియోగించుకోవాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుప్పం నియోజకవర్గంలో 80 వేల మంది హెల్త్ రికార్డులను తయారు చేశామని ఆయన వెల్లడించారు.

ఆరోగ్య స్కోరింగ్

వైద్య పరీక్షల అనంతరం వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించి స్కోరింగ్ కూడా ఇచ్చేలా చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు వివరించారు. 42 రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. డయాబెటిస్, బీపీ, అనీమియా, హృద్రోగం తదితర అనారోగ్య సమస్యలకు సంబంధిత వైద్య నిపుణులతో ఔషధాలను ఇప్పించటంతో పాటు ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. త్వరలో వైద్య సలహాల కోసం ఏఐ డాక్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

డిజి నెర్వ్ సెంటర్

డిజి నెర్వ్ సెంటర్ ద్వారా ఒక్క క్లిక్ తోనే వైద్యులు రోగులకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునేందుకు అవకాశం ఉందన్నారు సీఎం. సంజీవని ప్రాజెక్టు ద్వారా నమోదు చేసిన తుమ్మిశి గ్రామస్థుల డిజిటల్ హెల్త్ రికార్డులను వారి ఆరోగ్య వివరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొందరు అనీమియా లోపంతో బాధపడుతున్న మహిళలు, ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటున్న వారితో ముఖాముఖి మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించటంతో పాటు వైద్య నిపుణుల సేవలు అందేలా చూడాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. తుమ్మిశి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షల సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More