పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు..సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది.

Published on: Jan 12, 2026 2:26 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో తాము పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వెల్లడించారు.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం.. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని స్పష్టం చేసింది.

పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్ కోసం సన్నాహక, ప్రాజెక్టు సంబంధిత కార్యకలాపాలను కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఆపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. దావా వేయడంతో సహా చట్టంలో అందుబాటులో ఉన్న ఇతర తగిన పరిష్కారాలను పొందటానికి, ప్రస్తుత విచారణలో కోరిన అన్ని వాదనలను లేవనెత్తడానికి తెలంగాణకు స్వేచ్ఛను ఇచ్చింది. సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సీజేఐ సూచించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 అమలును సమర్థించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. గోదావరి నదీ జలాల కేటాయింపును నియంత్రించే బైండింగ్ ట్రిబ్యునల్ తీర్పును స్పష్టంగా ఉల్లంఘించిన దృష్ట్యా తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని సింఘ్వీ తెలిపారు.

ఈ వివాదం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితం కాదని కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక, మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయని తెలిపింది. వాదనల అనంతరం పక్షపాతం లేకుండా పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టుగా న్యాయవాది సింఘ్వీ తెలిపారు.

విచారణ అనంతరం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 131, సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సీజేఐ సూచించారని వెల్లడించారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనేకసార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని, వాటిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను అమలు చేయడం లేదని తెలిపామన్నారు.

'ఆంధ్రాకు కేటాయించిన 484.5 టీఎంసీలు.. కానీ ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. మెుదట డిజైన్ చేసినదానికంటే.. అదనంగా ఏం చేయడానికి వీల్లేదని వాదించాం.' అని ఉత్తమ్ మాట్లాడారు.