...
...
Next Story

ఏపీలో కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లె.. తెరపైకి మరో జిల్లా పేరు కూడా!

ఏపీలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అయితే తెరపైకి మరో జిల్లా పేరు కూడా వచ్చింది. రెవెన్యూ డివిజన్లు కూడా కొత్తగా ఏర్పాటు అవనున్నాయి.

Published on: Nov 25, 2025, 09:39:39 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు ఆసక్తిగా మారింది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా రోజులుగా మదనపల్లె, మార్కాపురం కొత్త జిల్లాలుగా ఏర్పాటు అవుతాయని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇవి ఖరారు అయిపోయినట్టే. అయితే తాజాగా మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది.

కొత్త జిల్లాల ఏర్పాటు సీఎం చంద్రబాబు
కొత్త జిల్లాల ఏర్పాటు సీఎం చంద్రబాబు

రంపచోడవరం, చింతూరు డివిజిన్లు ప్రస్తుతం అల్లూరి సితారామరాజు జిల్లాలో ఉన్నా.. అవి తూర్పుగోదావరి జిల్లాలో కలిస్తే జిల్లా విస్తీర్ణం, జనాభా మరింత పెరుగుతుంది. పోలవరం ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రంపచోడవరాన్ని కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటు చేసే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం. ఈ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు కూడా సులువుగా ఉంటుందని చర్చకు వచ్చింది. దీనికి కూడా సీఎం చంద్రబాబు ప్రాథమిక ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు పోలవరం ముంపు మండలాలకు ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

గన్నవరం, నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలన్న ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. స్థానిక నేతలు చెప్పారనే కారణంతో చేరుస్తారా.. భౌగోళిక పరిస్థితులు చూడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు సీఎం. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల సరిహద్దులను పరిశీలించాలని, తదనుగుణంగా మార్పులు చేయాలని ఆదేశించారు.

నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిరలు కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు అవుతాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. మరికొన్ని డివిజన్లలో కూడా మార్పులు రానున్నాయి. కొత్త డివిజన్లకు ఆమోదం లభిస్తే.. మెుత్తం 81 డివిజన్లు కానున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe