ఏపీలో మెగా కంటైనర్ పోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది : నీతి ఆయోగ్ సీఈఓ

 వైజాగ్ గ్రోత్ హబ్, పూర్వోదయ పథకం గురించి నీతి ఆయోగ్ సీఈఓ చర్చించారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్శించడానికి మెగా కంటైనర్ పోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Published on: Oct 23, 2025 10:36 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీఆర్ సుబ్రమణ్యం రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్‌తో కలిసి చర్చించారు. తీరప్రాంత అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో పూర్వోదయ పథకం, విశాఖపట్నం గ్రోత్ హబ్ గురించి మాట్లాడారు. తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందుందని, పూర్వోదయ కార్యక్రమం కింద మరింత అభివృద్ధికి అపారమైన అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలో అనేక ఓడరేవులు ఉన్నప్పటికీ, వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి మెగా కంటైనర్ పోర్టును ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర వినూత్న అభివృద్ధి పథకాలపై త్వరలో జరగనున్న ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ప్రత్యేక ప్రదర్శన కోసం వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ సీఈఓ.. ప్రధాన కార్యదర్శిని కోరారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్‌లను బలోపేతం చేసే ప్రణాళికలను కూడా నీతి ఆయోగ్ సీఈఓ సమీక్షించారు. ప్రాంతీయ కనెక్టివిటీ, పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచడంలో వాటి పాత్రను నొక్కి చెప్పారు.

‘కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లలో ప్రారంభించిన పూర్వోదయ పథకం, సాంస్కృతిక వారసత్వం, సహజ వనరులు, మానవ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా జాతీయ వృద్ధికి కీలకమైన చోదకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.’ అని సుబ్రహ్మణ్యం అన్నారు.

ఈ పథకం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు, పారిశ్రామిక కారిడార్లు వంటి ప్రధాన మౌలిక సదుపాయాలను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రాంతీయ కనెక్టివిటీ, ఉపాధి, నైపుణ్య అభివృద్ధిని పెంచుతుంది. విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుందని నీతి ఆయోగ్ సీఈఓకు ప్రధాన కార్యదర్శి విజయానంద్ బదులిచ్చారు. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి రాష్ట్రం గణనీయమైన ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అంతటా కొనసాగుతున్న, ప్రతిపాదిత అభివృద్ధి పనులకు మెరుగైన కేంద్ర సహాయాన్ని సిఫార్సు చేయాలని నీతి ఆయోగ్ సీఈఓను కోరారు. ‘విద్యా సంస్థలు, నైపుణ్య కేంద్రాలు, పారిశ్రామిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా, పూర్వోదయ సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, విక్షిత్ భారత్ 2047 దార్శనికతలో భాగంగా సమ్మిళిత వృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తుంది.’ అని విజయానంద్ అన్నారు.