FASTag Local Pass : ఇక ఆన్‌లైన్‌లోనే ఫాస్టాగ్‌ లోకల్ పాస్‌.. ఎలా తీసుకోవాలి?

FASTag Local Pass : జాతీయ రహదారుల్లో టోల్‌ప్లాజాలకు 20 కిలోమీటర్ల దూరంలోపు నివసించేవారికి ఎన్‌హెచ్ఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. లోకల్‌పాస్‌ల కోసం టోల్‌ప్లాజాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు.

Published on: Sep 5, 2026, 06:49:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు భారత జాతీయ రహదారుల సంస్థ(NHAI) డిజిటల్ విప్లవంతో సరికొత్త వెసులుబాటు కల్పించింది. టోల్‌ప్లాజాలకు సమీపంలో నివసించే ప్రజలు డిజిటల్ విధానంలో ఆన్‌లైన్ ద్వారానే ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్(FASTag Local Pass) పొందే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. గతంలో లోకల్ పాస్ కావాలంటే స్థానిక వాహనదారులు నేరుగా టోల్‌ప్లాజాలకు వెళ్లి, పత్రాలు సమర్పించి నిరీక్షించాల్సి వచ్చేది.

ఆన్‌లైన్‌లోనే ఫాస్టాగ్‌ లోకల్ పాస్‌
ఆన్‌లైన్‌లోనే ఫాస్టాగ్‌ లోకల్ పాస్‌

కానీ ఇప్పుడు ఎలాంటి భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఆన్‌లైన్ ద్వారానే నిమిషాల వ్యవధిలో పాస్ పొందే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఢిల్లీ-అర్బన్ ఎక్స్‌టెన్షన్ హైవేలోని ముండ్కా-బక్కర్వాలా టోల్‌ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా దాదాపు 130 కేంద్రాల్లో దీన్ని విస్తరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 12 టోల్‌ప్లాజాలు కూడా ఉన్నాయి.

టోల్‌ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివాసముంటున్న స్థానికులకు మాత్రమే ఈ లోకల్ పాస్ వర్తిస్తుంది. కారు, జీపు వంటి వ్యక్తిగత (నాన్-కమర్షియల్) వాహనదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో ఉన్న అడ్రస్ ఒకేలా ఉండాలి. రెండింటిలో తేడాలు ఉంటే సిస్టమ్ దరఖాస్తును తిరస్కరిస్తుంది.

ముందుగా NHAI అధికారిక రాజ్‌మార్గ్‌ యాత్ర మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో లోకల్ పాస్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీరు రోజువారీ ప్రయాణించే టోల్‌ప్లాజాను ఎంపిక చేసుకోవాలి. వాహన ఫాస్టాగ్ వివరాలు, మీ ఆధార్ సంఖ్య, వాహన ఆర్సీ వివరాలను అక్కడ నమోదు చేయాలి. ఈ యాప్ నేరుగా డిజిలాకర్, వాహన్ డేటాబేస్‌ల ఆధారంగా వివరాలను డిజిటల్‌గా ధృవీకరిస్తుంది. ఆ తర్వాత GIS (Geographic Information System) సాంకేతికత ద్వారా మీ నివాసం టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలోనే ఉందో లేదో సాఫ్ట్‌వేర్ తనిఖీ చేస్తుంది.

ప్రక్రియ పూర్తయ్యాక, నిర్ణీత రుసుము రూ.360ని ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే లోకల్ పాస్ జనరేట్ అవుతుంది. పాస్ పొందిన వాహనదారులు ఒక నెల వ్యవధిలో సదరు టోల్‌ప్లాజా ద్వారా ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు. మరుసటి నెలలో కూడా యాప్ ద్వారానే సులువుగా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చిన 12 టోల్‌ప్లాజాల్లో గొల్లప్రోలు మోపిదేవి, పెదగరువు (రాజమహేంద్రవరం), గంట్యాడ (విజయనగరం), బ్రాహ్మణపల్లి, చిట్టిమిట్టి చింతల, చోళసముద్రం, ఎర్రదొడ్డి, కొత్తపల్లి, అగనంపూడి(విశాఖపట్నం), పంచవటి, వెంకటపాలెం ఉన్నాయి.

విశాఖపట్నం సమీపంలోని అగనంపూడి టోల్‌ప్లాజా వద్ద గత రెండేళ్లుగా ఏ వాహనం నుంచీ టోల్ రుసుము వసూలు చేయడం లేదు. అయినప్పటికీ ఎన్‌హెచ్‌ఏఐ తన అధికారిక వెబ్‌సైట్ జాబితాలో ఆన్‌లైన్ లోకల్ పాస్ పొందే ప్లాజాలలో అగనంపూడి పేరును కూడా నమోదు చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More