కూటమి పాలనలో 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా: వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విపత్తుల సమయంలో సకాలంలో సహాయం అందించడంలో విఫలమైందని ఆరోపించారు.
ప్రస్తుత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 17 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్లో కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా కల్పించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జగన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, విపత్తుల సమయంలో సకాలంలో సహాయం అందించడంలో విఫలమైందని విమర్శించారు.

'ఎన్డీఏ సంకీర్ణ పాలనలో 19 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ 17 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. 84 లక్షల మంది రైతులకు గాను 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంట బీమా అందింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.' అని జగన్ అన్నారు.
రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఆలస్యంగా అందాయని, కౌలు రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని జగన్ అన్నారు. పండుగలా జరుపుకోవాల్సిన వ్యవసాయం, చంద్రబాబు పాలనలో భారంగా మారిందని వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 మధ్య గత వైసీపీ ప్రభుత్వంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని అన్నారు. తుపానులు, పంటకోతకు సిద్ధంగా ఉన్న పంటల గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం నష్టాలను నివారించలేకపోయిందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఈ-క్రాప్ వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు.
అమరావతి భూములపై జగన్ మాట్లాడారు. అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు, అమ్మకూడదని చట్టంలో ఉందన్నారు. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారని చెప్పారు.
సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలని మాట్లాడారు. గోబెల్స్కు చంద్రబాబే టీచర్ అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి కింద రూ. మూడు వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ.72 వేలు ఇవ్వాలి ఏమైందని విమర్శించారు.














