కర్నూల్ లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను ఇవాళ కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు.

అదుపులోకి తీసుకున్న తర్వాత స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఏ1 గా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య ఉన్నారు. ఇప్పటికే అతడిని అరెస్ట్ చేయగా.. తాజాగా ఓనర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. బీఎన్ ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో ఇటీవల(అక్టోబర్ 24,2025) జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. పలువురు గాయపడగా.. వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులను ఉలికిపడేలా చేసింది.
రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు కాగా…. కొద్దిరోజుల కిందటే ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణం గానే ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇద్దరు డ్రైవర్లు…. నలుగురు చిన్నారులు సహా మొత్తం 46 మంది ఉన్నారు. బైక్ బస్సు కిందికి వెళ్లటంతో పాటు కొంచెం దూరం అలాగే బస్సు ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇంజిన్ లో మంటలు చెలరేగటంతో ఘోర ప్రమాదం జరిగింది. కొందరు బయటపడినప్పటికీ… 19 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.