కర్నూలు బస్సు ప్రమాదంలో ట్విస్ట్.. ఘటనకు చాలాసేపటి ముందే చనిపోయిన బైకర్..బైక్‌పై ఉన్న రెండో వ్యక్తి ఏమయ్యాడు?!

కర్నూలు బస్సు ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో విచారణ చేస్తుంటే ఒక్కొక్కటిగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published on: Oct 25, 2025, 13:34:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. బైకర్ శివశంకర్ కూడా మృతి చెందాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే విచారణ చేస్తుంటే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూలు బస్సు ప్రమాదంలో మరో విషయం బయటకు వచ్చింది.

కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదం

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇందులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి వెళ్లిన దృశ్యాలు వైరల్‌గా అయ్యాయి. మరో యువకుడితో కలిసి బైకర్ శివశంకర్ పెట్రోల్ బంకుకు వెళ్లాడు. బైక్‌ను తీసే విధానం చూస్తే తాగి ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బైక్‌ మీద శివ శంకర్‌ ఉన్న సమయంలో వీ కావేరీ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టలేదని వెల్లడైంది. శంకర్‌, ఎర్రిస్వామి మద్యం మత్తులో వర్షంలో తడుస్తూనే బైక్ మీద వెళ్లినట్టుగా సమాచారం. చిన్నటేకూరు దగ్గర బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడ్డారు. బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. శంకర్‌, ఎర్రిస్వామి చెరో వైపు పడిపోయారు.

డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్‌ తలకు బలమైన గాయాలు అయ్యాయి. స్పాట్‌లో మృతి చెందాడు. స్వల్ప గాయాలతో ఎర్రిస్వామి బయటపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్‌పై నుంచి వీ కావేరి ట్రావెల్స్‌ బస్సు వెళ్లింది. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను ఈడ్చుకెళ్లింది. బస్సు ప్రమాదంతో భయపడి ఎర్రిస్వామి పారిపోయాడు. సీపీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రమాద ఘటనపై మొత్తం 16 ఫోరెన్సిక్‌ బృందాలు ఏర్పాటు చేశారు. డీఎన్‌ఏ పరీక్షల నిర్వహణకు 10 బృందాలు, ప్రమాద కారణాల అన్వేషణకు మరో 4 బృందాలు, రసాయన విశ్లేషణ కోసం మరో 2 బృందాలు ఏర్పాటు చేసినట్టుగా హోంమంత్రి ప్రకటించారు. ఇప్పటికే పలు కీలక విషయాలను అధికారులు తెలుసుకున్నారు.

ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు కీలక విషయాన్ని తెలిపారు. ప్రమాద తీవ్రత పెరగడానికి లగేజీ క్యాబిన్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్లు కారణం అని వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 234 రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు పేలిపోయాయి. ఈ ఫోన్‌ల బ్యాటరీలు పేలడం వల్ల బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు.

ప్రమాదంలో బైక్ బస్సు కిందకు వెళ్లింది. దానిలో నుంచి పెట్రోల్ లీక్ అయింది. బస్సు ద్విచక్రవాహనాన్ని అలాగే ఈడ్చుకెళ్లింది. దీంతో నిప్పు రవ్వలు ముదలయ్యాయి. పెట్రోల్, నిప్పు రవ్వలు కలిసి ప్రమాదానికి కారణం అయ్యాయి. ముదట లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకున్నాయి. అయితే అందులో స్మార్ట్ ఫోన్ల పార్సిల్ ఉంది.

234 రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారవేత్త పార్సిల్‌ చేశాడు. బెంగళూరులోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు పంపి.. అక్కడ నుంచి వినియోగదారులకు ఫోన్‌లు సరఫరా చేయాల్సి ఉండేది. లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకుని.. ఫోన్లు మంటల్లో చిక్కుకోవడంతో బ్యాటరీలు పేలుతున్న శబ్దం విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More