Pashu Kisan Credit Card : ఏపీలో పశు కిసాన్ క్రెడిట్ కార్డులు.. తక్కువ వడ్డీకే రుణాలు.. ఎలా అప్లై చేయాలి?
Pashu Kisan Credit Card : రైతులకు కిసాన్ క్రెడిక్ కార్డులు ఉన్నట్టే.. పశుపోషకులకూ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనితో వారికి ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయి.
పశుపోషకుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం, పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (PKCC) పథకాన్ని ప్రారంభించింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి. దామోదర్ నాయుడు ఒక పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లను పెంచే రైతులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందవచ్చని తెలిపారు.

అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సుస్థిర పశు నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. PKCC పథకం కింద, అర్హులైన రైతులు ఎలాంటి హామీ లేకుండా 7 శాతం వడ్డీ రేటుతో రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం రూ.3 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిలోగా రుణం తిరిగి చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనివల్ల వడ్డీ రేటు వాస్తవంగా 4శాతానికి తగ్గుతుంది.
ఈ పథకం రాష్ట్రంలోని సొంత భూమి ఉన్నవారు, కౌలుకు తీసుకున్నవారు, అలాగే స్వయం సహాయక బృందాల సభ్యులతో సహా అందరు పశుపోషకులకు అందుబాటులో ఉంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సమీపంలోని బ్యాంకు శాఖలలో ఆధార్ కార్డు, భూమి రికార్డులు, పశువుల వివరాలు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, పశువైద్య అధికారి నుండి ధృవీకరణ పత్రంతో పాటు సమర్పించాలి.
ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దామోదర్ నాయుడు రైతులకు పిలుపునిచ్చారు. అధిక వడ్డీకి ఇచ్చే ప్రైవేట్ రుణాలకు దూరంగా ఉండి, వాటికి బదులుగా తక్కువ వడ్డీకే రుణాల ద్వారా పశుపోషకులు అభివృద్ధి చెందాలన్నారు. పశువులు, నాణ్యమైన మేత, మెరుగైన నిర్వహణ పద్ధతులపై పెట్టుబడి పెట్టాలని సలహా ఇచ్చారు.
పీకేసీసీ పథకంపై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసి, విస్తృత ప్రచారం కల్పించి, సమర్థవంతంగా అమలు చేయాలని శాఖలోని క్షేత్రస్థాయి అధికారులను దామోదర్ నాయుడు ఆదేశించారు. పశువుల సంఖ్యను బట్టి నియమ నిబంధనల మేరకు గరిష్ఠంగా రూ.3లక్షల వరకు రుణం పొందవచ్చని వెల్లడించారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీతో రుణం తీసుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


