తిరుమల శ్రీవారి ఆలయంలో 54 కోట్ల భారీ స్కామ్.. పట్టు వస్త్రాలు కాదు.. పాలిస్టర్!

తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా ఓ స్కామ్ బయటపడింది. పట్టువస్త్రాల కొనుగోలు విషయంలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

Published on: Dec 10, 2025 3:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుపతిలాంటి ప్రపంచ ప్రఖాత్య క్షేత్రంలో తాజాగా మరో స్కామ్ బయపడింది. ఇప్పటికే పలు రకాల విషయాల్లో తిరుపతి పేరు బయటకు వస్తూనే ఉంది. తాజాగా మరో కుంభకోణం బయటకు వచ్చింది. శ్రీవారి ఆలయంలో అతిథులు, వీఐపీలకు, ప్రత్యేక సేవల్లో ఉపయోగించే పట్టువస్త్రాలు నాణ్యత కలిగి ఉండాలి. అయితే పట్టువస్త్రాలకు బదులుగా పాలిస్టర్‌ను సరఫరా చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

తిరుమల పట్టు వస్త్రాల స్కామ్
తిరుమల పట్టు వస్త్రాల స్కామ్

తిరుమల తిరుపతి దేవస్థానంలో 2015 నుండి 2025 వరకు దశాబ్ద కాలం పాటు రూ.54 కోట్ల భారీ పట్టు వస్త్రాల కుంభకోణం బయటపడటం ఆందోళన కలిగిస్తుంది. ఒక కాంట్రాక్టర్ 100 శాతం పాలిస్టర్ వస్త్రాలను నిరంతరం సరఫరా చేస్తున్నాడని, టెండర్ పత్రాలలో పేర్కొన్న స్వచ్ఛమైన పట్టు ఉత్పత్తులుగా వాటిని బిల్ చేస్తున్నట్లు అంతర్గత విజిలెన్స్ విచారణలో తేలింది. తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని టీటీడీ బోర్డు అనుమానాలు లేవనెత్తిన తర్వాత అంతర్గత దర్యాప్తులో మోసం గురించి వెల్లడైంది. దాతలకు సమర్పించే, వేదఆశీర్వచనం వంటి ఆలయ ఆచారాలలో ఉపయోగించే శాలువాల కోసం తప్పనిసరిగా అవసరమయ్యే స్వచ్ఛమైన పట్టుకు బదులుగా కాంట్రాక్టర్ చౌకైన పాలిస్టర్‌ను సరఫరా చేశాడు.

ఈ అక్రమాలు పదేళ్ల కాలంలో జరిగాయని అంచనా వేశారు. దీని ఫలితంగా ఆలయ ట్రస్టుకు రూ. 54 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 'సుమారు రూ. 350 ఖరీదు చేసే శాలువాకు రూ. 1,300 బిల్ చేస్తున్నారు. మొత్తం సామాగ్రి రూ.50 కోట్లకు పైగా ఉంటుంది. మేం అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు కోరాం.' అని బీఆర్ నాయుడు అన్నారు.

శాలువాల నమూనాలను శాస్త్రీయ విశ్లేషణ కోసం రెండు ప్రయోగశాలలకు పంపారు టీటీడీ అధికారులు. సెంట్రల్ సిల్క్ బోర్డ్ (CSB)కి కూడా ఒకటి పంపించారు. రెండు పరీక్షలలో ఆ పదార్థం పాలిస్టర్ అని కన్ఫామ్ అయింది. ఇది టెండర్ స్పెసిఫికేషన్ల స్పష్టమైన ఉల్లంఘన అని అర్థమవుతోంది. నిజమైన పట్టు ఉత్పత్తులను ప్రామాణీకరించడానికి ఉద్దేశించిన తప్పనిసరి పట్టు హోలోగ్రామ్ సరఫరా చేసిన నమూనాలలో లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

ఈ పదేళ్ల కాలంలో టీటీడీకి జరిగే పట్టు వస్త్రాల సరఫరాలో ఎక్కువ భాగం ఒకే సంస్థ, దాని అనుబంధ సంస్థలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ నివేదికపై వేగంగా స్పందించిన టీటీడీ ట్రస్ట్ బోర్డు, ఆ సంస్థతో ఉన్న అన్ని టెండర్లను రద్దు చేసింది. సమగ్ర దర్యాప్తు కోసం మొత్తం విషయాన్ని ఏసీబీకి తెలిపింది.

ఈ మధ్యకాలంలో టీటీడీలో ఇలాంటి ఘటనలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలతో పాటు పరకామణి దొంగతనం కేసుకు సంబంధించిన విషయంపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. తాజాగా పట్టు వస్త్రాల కుంభకోణం కూడా బయటకు వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్న తిరుమలలో వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పదే పదే జరుగుతున్న కుంభకోణాలతో అనేక ప్రశ్నలు వస్తున్నాయి.