యూపీఎస్సీ అభ్యర్థుల కోసం సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు : భట్టి విక్రమార్క

ప్రతిభకు ఆర్థిక ఇబ్బందులు అడ్డురాకూడదనే ఉద్దేశంతో యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆర్థికంగా అండగా ఉంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

Published on: Dec 04, 2025 8:39 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మంది అభ్యర్థులకు సింగరేణి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, సింగరేణి సీఎండి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులతో మంత్రులు భట్టి, పొన్నం
యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులతో మంత్రులు భట్టి, పొన్నం

ప్రతిభకు ఆర్థిక ఇబ్బందులు అడ్డురాకూడదనే సంకల్పంతో మెయిన్స్‌కు ఎంపికైన వారికి లక్ష రూపాయలు, ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారికి అదనంగా మరో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

'గతేడాది 20 మంది ఎంపిక కాగా, ఈసారి 50 మంది అర్హత సాధించడం ప్రశంసనీయం. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య ఎంత పెరిగినా ఎంతమందికైనా ఆర్థిక సాయం అందిచడం జరుగుతుంది. సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేయాలని ఇప్పటికే చీఫ్ సెక్రటరీతో చర్చలు జరిపాం.' అని భట్టి విక్రమార్క వెల్లడించారు.

భట్టిని కలిసిన రాజస్థాన్ మంత్రి

అంతకుముందు భట్టి విక్రమార్కను రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్‌ను ప్రజా భవన్‌లో కలిశారు. తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో చేపట్టనున్న 2,300 మెగావాట్ల ఉమ్మడి విద్యుత్ ప్రాజెక్టులకు (1,500 మెగావాట్ల సౌర, 800 మెగావాట్ల థర్మల్) రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం గురించి చర్చించారు.

క్వాంటం సిటీ

తెలంగాణ ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌ను “క్వాంటం సిటీ”గా అభివృద్ధి చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించింది. క్వాంటం టెక్నాలజీలకు జాతీయ, ప్రపంచ కేంద్రంగా రాష్ట్రాన్ని ఉంచే లక్ష్యంతో భారతదేశపు మొట్టమొదటి దీర్ఘకాలిక క్వాంటం వ్యూహాన్ని ఆవిష్కరించింది. క్వాంటం, తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ కోసం నీతి ఆయోగ్ రోడ్‌మ్యాప్‌ను హైదరాబాద్(IIIT-H)లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో అధికారికంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు, అధునాతన డిజిటల్ వ్యవస్థలతో పాటు, క్వాంటం టెక్నాలజీలలో తెలంగాణ ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, సెన్సింగ్, క్రిప్టోగ్రాఫిక్ భద్రతలో అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు, పరిశోధన మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రతా వ్యవస్థలు, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణ, మానవ మూలధన అభివృద్ధిని బలోపేతం చేయడం ఈ వ్యూహం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.